చేప ప్రసాదం పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు : మంత్రి తలసాని

నవతెలంగాణ – హైదరాబాద్‌: కరోనా కారణంగా మూడు సంవత్సరాల పాటు నిలిపివేసిన ఉచిత చేప ప్రసాదం పంపిణీ జూన్‌ 9న తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు అస్తమా బాధితులకు జూన్ 9వ తేదీన నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కి ప్రభుత్వం తరుఫున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. బత్తిన హరినాథ్‌ గౌడ్ కుటుంబ సభ్యులు వంశపారంపర్యంగా 170 సంవత్సరాల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. చేప ప్రసాదం కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి కూడా లక్షలాది మంది వస్తుంటారని వివరించారు. బత్తిన సోదరుల నివాసం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు పోలీస్ ఎస్కార్ట్ తో ప్రసాదం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.పంపిణీకి అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వమే మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేస్తుందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు, అంబులెన్స్ లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఒకటి, రెండు రోజులు ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటారని చెప్పారు. వారికి జైశ్వాల్ సమాజ్, అగర్వాల్ సమాజ్, శ్రీకృష్ణ కమిటీ, బద్రి విశాల్ పిట్టి వంటి పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో అల్పాహారం, భోజనం అందించే ఏర్పాట్లు చేస్తుంటారని తెలిపారు. ఈ సమావేశంలో బత్తిన హరినాథ్‌ గౌడ్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రహమతుల్లా బేగ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, పోలీసు, విద్యుత్‌, వైద్య శాఖ, అధికారులు పాల్గొన్నారు.

Spread the love