జోక్యం చేసుకోలేమన్న సుప్రీం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదనే కారణంతో ఆమె నామినేషన్ను ఎన్నికల సంఘం (ఈసీ) తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోజాలమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇసి నిర్ణయాన్ని సమీక్షించి న్యాయం చేయాలని కోరుతూ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్.. ఒకసారి నామినేషన్ను తిరస్కరించాక, ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ ఎన్నికల సంఘాన్నే ఆశ్రయించాల్సిందేనని ధర్మాసనం సూచించింది. ప్రస్తుత దశలో తాము నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అనంతరం మీనాక్షి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కనీసం రెండేండఅళ శిక్ష విధించే అవకాశమున్న కేసులనే అభ్యర్థులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుత కేసులో సమన్లు మాత్రమే జారీ అయ్యాయని ధర్మాసనానికి వివరించారు. అయినప్పటికీ రిటర్నింగ్ అధికారి తప్పుగా ధ్రువీకరిస్తూ.. నామినేషన్ను తిరస్కరించారని వాదించారు. దీనిపై స్పందిస్తూ, నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం.. గతంలో అలాంటి తీర్పులేమైనా ఉంటే న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని సూచించింది. గతంలో నామినేషన్ల పత్రాలను తిరస్కరించిన కేసుల్లో ఎప్పుడైనా కోర్టు జోక్యం చేసుకున్న తీర్పులు ఉన్నాయా? అని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఆ పిటీషన్ను కోర్టు డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. నామినేషన్ తిరస్కరణ అంశంలో ఆర్టికల్ 32 ప్రకారం చర్యలు తీసుకోవాలని మీనాక్షీ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఈ కేసులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీం సూచించింది. ఈ కేసులో ఎటువంటి మెరిట్స్ లేవని ధర్మాసనం పేర్కొంది.
మీనాక్షి నటరాజన్కు దక్కని ఊరట
- Advertisement -
- Advertisement -



