– కాంగ్రెస్ హామీలన్నీ బోగస్వే.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణ
నవతెలంగాణ- మహబూబ్నగర్
”ఓట్ల కోసం దేవుడి మీద ఒట్టు వేయడం కాదు.. మీ కుటుంబ సభ్యులపై ఒట్టు వేసి నిజం చెప్పు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ హామీలన్నీ బోగస్ హామీలే.. ఇవాళ కాంగ్రెస్ అన్ని వర్గాల్లో నమ్మకాన్ని కోల్పోయింది” అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణ విమర్శించారు. మహబూబ్నగర్లోని తన స్వగృహంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికారం కోసం హామీలు ఇవ్వడం.. మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నా రేవంత్రెడ్డి ఆరుసార్లు పాలమూరు జిల్లాకు వచ్చారంటే కాంగ్రెస్కు ఓటమి భయం మొదలైందన్నారు. రేవంత్ రెడ్డి జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా.. తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఆయన తిట్టడమే కాకుండా.. ఆయన చెంచాలతో నీతి వాక్యాలు పలికిస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం దేవుళ్ల మీద ఒట్లు వేస్తారా.. ఇదెక్కడి నీచ రాజకీయం అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం మోడీని కించపరిచేలా మాట్లాడినా అభివృద్ధి లక్ష్యంగా నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీకి పాలమూరు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు. ఒక మహిళా నేత గురించి మాట్లాడే ముందు ఎలా మాట్లాడాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 సీట్లు గెలిచేది లేదు.. వాకిటి శ్రీహరి మంత్రి అయ్యేదిలేదని అన్నారు. పాలమూరు అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సత్తా తనకు మాత్రమే ఉందని, దేశం కోసం మోడీని.. పాలమూరు కోసం అరుణను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బురుజు రాజేందర్ రెడ్డి, పాండురంగారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అచ్చుగట్ల అంజయ్య, వేణుగోపాల్, యాదయ్య, రాజేందర్ ఉన్నారు.