నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు టాస్ డైరెక్టర్ పివి శ్రీహరి ఒక ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ పదో తరగతిలో 30,564 మంది పరీక్షలు రాయగా, 15,193 (49.71 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. ఇంటర్మీడియెట్లో 42,026 మంది పరీక్షలు రాస్తే, 19,813 (47.14 శాతం) మంది పాసయ్యారని తెలిపారు. మార్కుల మెమోలను 15 రోజుల్లో సంబంధిత కేంద్రాలను పంపిస్తామని పేర్కొన్నారు. www.telanganaopenschool.org వెబ్సైట్ ద్వారా మెమోలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 24 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రీకౌంటింగ్ కోసం ఇంటర్ విద్యార్థులు రూ.400, టెన్త్ విద్యార్థులు రూ.350, రీవెరిఫికేషన్ కోసం ఇంటర్, టెన్త్ విద్యార్థులు రూ.1,200 చెల్లించాలని తెలిపారు.