నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష ఫలితాలను తెలంగాణా పోలీసు నియామకమండలి మంగళవారం విడుదల చేసింది.
మొత్తం పోస్టులకు గాను 84శాతం మంది అర్హత సాధించినట్టు తెలిపింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యునికేషన్కు 4,564మంది, ఎస్సై సివిల్ 43,708 మంది, ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కు 283 మంది చొప్పున అర్హత సాధించినట్టు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.మంగళవారం రాత్రి నుంచి అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు వెబ్సైట్లో పెడతామని రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది.
ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లను తమ వెబ్సైట్లో ఉంచాక అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లో చెక్ చేసుకోవచ్చని పేర్కొ ంది. జూన్ ఒకటో తేదీ ఉదయం 8గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8గంటల వరకు అభ్యర్థులు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
రీ కౌంటిగ్ లేదా రీ వెరిఫికేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.2000, ఇత రులకు రూ. 3000 ఫీజు నిర్ణయించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో వివరాల తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పి స్తామని బోర్డు తెలిపింది.