‘హను-మాన్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, చైతన్య సమర్పణలో తమ తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు . ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రొమ్-కామ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే టైటిల్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘వై దిస్ కొలవెరి’ అనేది ట్యాగ్లైన్. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.’నిరంజన్ చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ‘హనుమాన్’ విడుదలకు సిద్ధమౌతున్న సమయంలో దర్శితో సినిమాని టేకప్ చేశారు. ఇంత మంచి కథని వదులుకోలేనని చెప్పారు. దర్శకుడు అశ్విన్కి చాలా ప్యాషన్, ఎనర్జీ ఉంది. నభా లాంటి మంచి నటి ఈ ప్రాజెక్ట్లో ఉండటం అన్నీ సరిగ్గా సమకూరినట్లయింది. ‘హనుమాన్’ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో డార్లింగ్ కూడా అంతటి పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ‘నన్ను నమ్మి ఈ కథని నాతో చేసిన దర్శక, నిర్మాతల నమ్మకం హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది. ప్రభాస్కి, ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రభాస్ని ప్రేమతో పిలుచుకునే టైటిల్ ఈ సినిమాకి పెట్టడం మాకు చాలా గర్వకారణం. ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తాం. ఇది డార్లింగ్ ప్రామిస్’ అని హీరో ప్రియదర్శి అన్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ,’దర్శకుడు అశ్విన్ నమ్మింది అద్భుతంగా తెరపై తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు. ‘ప్రియదర్శికి ఈ కథ చెప్పగానే తప్పకుండా చేద్దామని మాటిచ్చారు. మా కలలని నమ్మే వ్యక్తి కోసం ఎదురుచూశాం. నిర్మాత నిరంజన్, చైతన్య మా కలల్ని సాకారం చేశారు. కథ చెప్పగానే నమ్మారు. శరవేగంగా సినిమాని చేశాం’ అని దర్శకుడు అశ్విన్ రామ్ చెప్పారు.