రాజమండ్రి తెలుగుదేశం మహానాడుకు.. పెద్ద ఎత్తున తరలి రావాలి

– టీడీపీ శ్రేణులకు కాసాని జ్ఞానేశ్వర్‌ పిలుపు
– మహానాడు విజయవంతంపై పార్టీ శ్రేణులతో కాసాని టెలికాన్ఫరెన్స్‌
నవతెలంగాణ – హైదరాబాద్‌
రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు వేడుకకు తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ మిత్రులైన నాయకులకు, కార్యకర్తలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28వ తేదీలలో ఆంధ్రప్రదేశ్‌ లోని రాజమహేంద్రవరంలో జరిగే మహానాడు వేడుకలో పాల్గొని విజయవంతం చేయడంపై కాసాని జ్ఞానేశ్వర్‌ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి పొలిట్‌ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్లమెంట్‌, మండల స్థాయిలలో ఉన్న అన్ని కమిటీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ మహానాడుకు వచ్చే వారందరూ ముందుగా రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఎవరెవరూ వస్తున్నారో సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాజమండ్రిలో తెలంగాణ రాష్ట్ర పార్టీ విభాగానికి చెందిన కౌంటర్లలో తప్పనిసరిగా ఎన్రోల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిన వారికి అకామిడేషన్‌, భోజన వసతుల కొరకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడడానికి పార్టీ మహిళా, యూత్‌, విద్యార్థి విభాగాలకు చెందిన నాయకులతోపాటు రాష్ట్ర పార్టీ కార్యాలయ సిబ్బంది సమన్వయం చేస్తారని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

Spread the love