త్వరలో అందరినీ కలుస్తా

త్వరలో అందరినీ కలుస్తా– మంచి వైద్యం అందుతుంది : బి వెంకట్‌తో తమ్మినేని
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను శుక్రవారం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్‌, తమ్మినేని కుమారుడు సంఘమిత్ర పరామర్శించారు. ఈ సందర్భంగా తమ్మినేని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం బాగానే ఉందనీ, మీరేలా ఉన్నారంటూ తమ్మినేని మాట్లాడారంటూ బి వెంకట్‌ నవతెలంగాణతో చెప్పారు. ఏఐజీ ఆస్పత్రిలో మంచి వైద్యం అందుతోందని తమ్మినేని చెప్పినట్టు వివరించారు. త్వరలో అందరినీ కలుస్తామన్నారని అన్నారు. ఆరోగ్యం కుదట పడుతుందనీ, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరంలేదనే విషయాన్ని ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయాలంటూ సూచించారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల గురించి ప్రస్తావించారని అన్నారు. పార్టీ శ్రేణులు ఎలా ఉన్నారంటూ తమ్మినేని అడిగారని గుర్తు చేశారు. ఎవరు ఆస్పత్రి రావొద్దని పార్టీ శ్రేణులకు బి వెంకట్‌ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మీడియాతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ తమ్మినేని ఆరోగ్యం మెరుగుపడుతున్నదని చెప్పారు. పరామర్శకు వెళ్లిన వారితో మాట్లాడుతున్నారని వివరించారు. బీపీ సాధారణస్థితిలో ఉందనీ, క్రియాటిన్‌ గతం కంటే తగ్గిందని అన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సందర్శకులు ఎక్కువగా వస్తే ఇబ్బంది కలుగుతుందని డాక్టర్లు చెప్తున్నారనీ, ఆస్పత్రికి ఎవరూ రావొద్దని కోరారు. కొద్దిరోజుల్లోనే ఆస్పత్రి నుంచి బయటికొస్తారనీ, అందరినీ కలుస్తారనీ, ప్రజాజీవితంలో, రాజకీయ జీవితంలో యధావిధిగా ఉంటారని చెప్పారు.

Spread the love