‘సికిల్‌సెల్‌’ వ్యాధిని ఆరోగ్య సమస్యగా గుర్తించాలి

సికిల్‌ సెల్‌ వ్యాధి దేశవ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రజా ఆరోగ్య సమస్యగా గుర్తించాలని 2008 డిసెంబర్‌ 22న జరిగిన ఐక్య రాజ్య సమితి 63వ జనరల్‌ అసెంబ్లీ ప్లీనరీ సమావేశం ప్రత్యేకంగా తీర్మానించింది. అంటే వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సికిల్‌ సెల్‌ డిసీజ్‌పై ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసు కోవాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను ఆదేశించింది. అందుకే 2009 నుండి ప్రపంచ దేశాలన్నీ జూన్‌ 19న అంతర్జాతీయ సికిల్‌ సెల్‌ డిసీజ్‌ దినోత్సవాన్ని జరుపుతూ ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నవి. కానీ మనదగ్గర దినోత్స వాలకే పరిమితం తప్ప వ్యాధి మీద పర్యవేక్షణ లేకుండా పోతోంది. ఈ వ్యాధి మొదటిసారిగా వెస్టిండీస్లోని గ్రెనిడా ద్వీపానికి చెందిన ఒక్క దంత వైద్య విద్యార్థిలో గుర్తించారు. ప్రారంభంలో ఆఫ్రికన్‌ ప్రాంతంలో వ్యాధి లక్షణాలు కనిపించిన తరువాతి కాలంలో భారత దేశంలో అనేక ప్రాంతాల్లో వేగంగా విస్తరించింది. ముఖ్యంగా మనదేశంలో గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. 2020 నాటికి సికిల్‌ సెల్‌ అనీమియా అనే జన్యుపరమైన వ్యాధిని కలిగిన వారిలో ఉన్న రక్తహీనత నిర్మూలించడానికి 2018 లో కేంద్ర ప్రభుత్వం ”అనీమియా ముక్త్‌భారత్‌” కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని 2023 నాటికి కూడా చేరుకోలేదు. కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో ‘మిషన్‌ మోడ్‌ 2047’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సికిల్‌ సెల్‌ అనీమియాతో పాటు రక్త రుగ్మ తలు, రక్తాన్ని ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధులను నివారించడానికి కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గ దర్శకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
సికిల్‌ సెల్‌ వ్యాధి లేదా సికిల్‌ సెల్‌ అనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అనేది వంశ పారంపర్యంగా సంక్రమిస్తున్న రక్త రుగ్మత. సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుడ్రంగా పెప్పెర్‌మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటాయి. అయితే కొంతమందిలో జన్యుసంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్తకణాలు కొడవలి (సికిల్‌) ఆకా రంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్‌ సెల్‌ ఉన్నవారి రక్తకణంలోని ఒక జన్యువు సికిల్‌ సెల్‌గానూ, ఒకటి మామాలుగానూ ఉన్నట్లయితే అటువంటి వారిని సికిల్‌ సెల్‌ క్యారియర్లు అంటారు. వీళ్లకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులకు ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారికి పుట్టిన పిల్లలకు రక్త కణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవిత కాలం 120 రోజులైతే సికిల్‌ సెల్‌ రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 25రోజులు మాత్రమే. సికిల్‌ సెల్‌ రక్త కణాల జీవిత కాలం తక్కువగా ఉండడం వలన, వేగంగా కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి కలిగిన వారు రక్తహీనతకు గురవుతారు. అంతేకాక సికిల్‌ సెల్‌ రక్తకణాలు వంపు తిరిగి ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తం సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్‌ అందటం తగ్గిపోతుంది. అం దువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే చిన్నతనంలోనే చనిపోతారు. వ్యాధి కలిగిన వారి సగటు జీవిత కాలం 42-48 సంవత్స రాలు. జన్యుపరమైన మార్పుల వలన ఏర్పడుతున్నా ఈ రక్తహీనత జబ్బుకు సరైన మం దులు లేవు. దేశంలో 17రాష్ట్రాల్లో సికిల్‌ సెల్‌ డిసీజ్‌ సుమారు 20లక్షల మంది కలిగి ఉన్నారని అంచనా. దేశ వ్యాప్తంగా 200 జిల్లాలో 40ఏండ్లలోపు వయస్సు కలిగిన 7కోట్ల మంది గిరిజనులకు 2025-26 నాటికి ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణ కోసం స్క్రీనింగ్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కానీ 2022-23 సంవత్సరంలో కోటి మందికి స్క్రీనింగ్‌ చేయాలని లక్ష్యం ఉంటే కేవలం 1,05,954 మందికి చేస్తే 5,959మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ప్రపంచలోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది.ప్రతి సంవత్సరం సుమారు 40వేల మంది పిల్లలు ఈ వ్యాధితో పుడుతున్నారని సమాచారం. ప్రతి ఏటా 50శాతం మంది పిల్లలు 5 సంవత్సరాల కంటే ముందే చనిపోతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సూచన మేరకు సికిల్‌సెల్‌ డిసీజ్‌ పై అవగాహన, నివారణ కోసం విశ్వ విద్యాలయాల గ్రాంట్స్‌ కమిషన్‌ ఉన్నత విద్యాసంస్థలకు సంబంధిత కోర్స్‌ పాఠ్యాంశాల్లో సికిల్‌ సెల్‌ డిసీజ్‌కు సంభందించిన అధ్యాయాన్ని చేర్చి వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతలు, కొడవలి కణం, దాని కారణాలు, చికిత్స, వారసత్వ నమూనా, పరీక్షించే విధానాలు, నివారణపై పాఠ్యాంశాల్లో భాగంగా బోధించాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్‌లో జనాభాలో 15 నుండి 33శాతం మందికి ఈ వ్యాధి ఉన్నట్లు ముంబైకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ అధ్యాయనం పేర్కొంది. ఆటోసోమల్‌ రిసెసివ్‌ డిజార్డర్‌, గుర్తించ బడకపోతే పేరెంట్‌ క్యారియర్‌ల ద్వారా ఒకతరం నుండి మరొకతరానికి వ్యాపిస్తుంది.”తల్లిదండ్రులిద్దరిలో సికిల్‌సెల్‌ హిమోగ్లోబిన్‌ లక్షణాలు ఉంటే ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపించే అవకాశాలు ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, ఆసిఫాబాద్‌, వరంగల్‌,జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ , మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని గిరిజనులు, ఆదివాసీలలో వ్యాధి తీవ్రత ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉందని అనేక అధ్యాయనాల ప్రకారం తెలుస్తుంది. గిరిజన సంక్షేమ పాఠ శాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలలు, హాస్టళ్లలో 2.25 లక్షల మంది గిరిజన, ఆదివాసీ పిల్లలకు వ్యాధి నిర్ధారణ పరీక్ష నిర్వహిం చాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రాణాంతకమైన మలేరియా లక్షణం అయిన ప్లాస్మొడియం ఫల్సిఫరమ్‌ నుండి నుండి గిరిజనుల ప్రాణాలను కాపా డటంలో సికిల్‌ సెల్‌ డిసీజ్‌ దోహదపడుతుందని జబల్‌ పూర్‌లోని ట్రైబల్‌ హెల్త్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అధ్యాయనం వెల్లడించింది. ఈ వ్యాధి నిర్ధారణ ప్రాథ మిక పరీక్షను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పీహెచ్‌సీ స్థాయి లోనే జరపవచ్చు.సికిల్‌ సెల్‌ వ్యాధి చికిత్సకు సరైన మందులు లేనందున, సికిల్‌ సెల్‌ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధిని త్వరితంగా నివారించకపోతే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా మన దేశంలో పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి ఎన్‌డీఏ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను నిర్వీర్యం చేయ డానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన మిషన్‌ మోడ్‌ 2047 కార్యక్రమం సికిల్‌సెల్‌ డిసీజ్‌ నిర్మూలనకు దోహదం చేసేలా ఉండాలని కోరుకుందాం.

ఎం. అడివయ్య
9490098713

Spread the love