కిరణ్, తరుణ్కు నిరాశ
ఆస్ర్టేలియన్ ఓపెన్ సూపర్ 500
సిడ్నీ : వరుస టోర్నమెంట్లలో నిరాశపరుస్తున్న భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు సిడ్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించిన సింధు ఆస్ర్టేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో ముందంజ వేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో పెరూ షట్లర్ లూసియాపై 21-13, 21-11తో వరుస గేముల్లో సింధు గెలుపొందింది. 32 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో సింధుకు లూసియా కనీస పోటీ ఇవ్వలేదు. తొలి గేమ్లో 9-9 వరకు రేసులో నిలిచిన లూసియా.. ఆ తర్వాత చతికిల పడింది. కీలక రెండో గేమ్లో 11-9తో ముందంజ వేసిన సింధు.. ద్వితీయార్థంలో రెచ్చిపోయింది. వరుసగా ఐదు పాయింట్లు సాధించి లూసియా ఆశలై నీళ్లు చల్లింది. యువ షట్లర్ తన్వీ శర్మ ఐదో సీడ్, చైనీస్ తైపీ షట్లర్ పిన్ చియాన్కు షాక్ ఇచ్చింది. 21-12, 22-20తో వరుస గేముల్లో అదిరే విజయం సాధించింది. వరల్డ్ నం.11పై తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన తన్వీ శర్మ.. రెండో గేమ్లో గట్టి పోటీ ఎదుర్కొంది. విరామ సమయానికి 10-11తో వెనుకంజ వేసింది. ఓ దశలో 11-17తో ఆరు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. అయినా, వెనక్కి తగ్గని తన్వీ శర్మ వరుస పాయింట్లతో పుంజుకుంది.
17-17తో స్కోరు సమం చేసింది. 20-20 వద్ద వరుసగా రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని తొలి రౌండ్లో అద్భుత విజయం సాధించింది. మాళవిక బాన్సోద్ 15-21, 21-7, 21-3తో థాయ్లాండ్ షట్లర్పై గెలుపొందగా.. తాన్య హేమంత్ 21-17, 21-18తో అమెరికా షట్లర్ ఇషికా జైస్వాల్ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్లో కిరణ్ జార్జ్కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో మలేషియా షట్లర్ జస్టిన్ చేతిలో 19-21, 21-14, 15-21తో పోరాడి ఓడాడు. గంటకు పైగా సాగిన మ్యాచ్లో నిర్ణయాత్మక గేమ్లో కిరణ్ జార్జ్ తడబాటుకు గురయ్యాడు. తరుణ్ మానెపల్లి తొలి గేమ్ను 21-18తో నెగ్గినా.. ఆ తర్వాత వరుస గేములను 13-21, 23-25తో పోరాడి ఓడాడు. దీంతో తొలి రౌండ్ నుంచే తరుణ్, కిరణ్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మిక్స్డ్ డబుల్స్లో లోహిత్, లక్షిత జోడీ 6-21, 5-21తో రెండో సీడ్ చైనా షట్లర్ల చేతిలో తేలిపోయారు. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్ 19-21, 21-10, 20-22తో మలేషియా షట్లర్ వాంగ్ లింగ్ చింగ్ చేతిలో ఓటమిపాలైంది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ రావత్, మనీశ జంట 21-13, 21-14తో ఆస్ట్రేలియా జోడీ జైడెన్, విక్టోరియాలపై వరుస గేముల్లో గెలుపొంది ముందంజ వేశారు.
సింధు శుభారంభం
- Advertisement -
- Advertisement -



