హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఊపిరే’ అంటూ సాగే మూడో పాట విడుదలైంది.
ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటల మాదిరిగానే ‘ఊపిరే’ పాట కూడా కట్టిపడేసేలా ఉంది. అభరు జోధ్పుర్కర్, సంజన కలమంజే ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. ”సొగసే మా వీధి వైపు.. సరదాగా సాగెనే.. దిశలేమో నన్ను చూసి.. కను గీటెనే” అంటూ కథానాయికపై కథానాయుడికి ఉన్న ప్రేమను తెలిపేలా ఎంతో అందంగా ఉంది ఈ పాట. సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్టుగానే నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.