టీడీపీ విజన్‌ వినాశకరం

– సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
అమరావతి : తెలుగుదేశం పార్టీ విశాఖలో ప్రకటించిన విజన్‌ 2047 వినాశకరమైందని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేది కాదని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం విజయవాడలో ఆ పార్టీ ఎన్‌టిఆర్‌ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. విజన్‌ 2020 తర్వాత వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరిగాయని అయినా పాలకులు పాఠం నేర్చుకోవడం లేదని తెలిపారు. విజన్‌ 2047ని కొత్త సీసాలో పాత సారాగా ఆయన అభివర్ణించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తుంటే వైసిపి, టిడిపిలు బిజెపిని ఎలా బలపరుస్తున్నాయని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానంటూ వాగ్దానాలు చేసే చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయాలని, విద్యాసంస్థలను కుదించాలని, విద్యుత్‌ సంస్కరణలను కొనసాగించాలని తన విజన్‌ 2047లో చెప్పడం ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్రాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. పి4 విధానంలో ప్రజల పాత్ర ఒక భ్రమ అని, సహజ వనరులను దోచుకోవడానికే పి4 విధానం తోడ్పడుతుందని విమర్శించారు. వైసిపి విధానాలు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీశాయని, దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని చెబుతున్న చంద్రబాబు నాయుడు గత విధానాలనే అనుసరించడం, అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో చెప్పాలన్నారు. బిజెపి కేంద్రంలో అనుసరించే విధానాలనే రాష్ట్రంలో వైసిపి అనుసరిస్తున్నదని, ఈ రెండు విధానాలకు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విజన్‌కు ఏ మాత్రమూ భిన్నం కాదని అన్నారు. గతం నుండి పాఠాలు నేర్చుకోకుండా, పాచిపోయిన పాత విధానాలనే అమలు చేసి రాష్ట్రాన్ని సుడిగుండంలోకి నెట్టొద్దని, టిడిపి తన విధానాలపై పునరాలోచన చేసి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, యువతరం భవిష్యత్‌కి తోడ్పడే ప్రత్యామ్నాయ విధానాలు తీసుకోవాలని, ప్రపంచంలో మారుతున్న కొత్త పరిస్థితులను అధ్యయనం చేయాలని శ్రీనివాసరావు సూచించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపిని మట్టి కరిపించాలని, బిజెపిని ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరిచే మిత్రులకు కూడా మద్దతు ఇవ్వొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో సిపిఎం ప్రజా పునాదిని విస్తరించుకోవడానికి, పార్టీ బలపడటానికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, వై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Spread the love