అమెరికా విదేశాంగ మంత్రి
మార్కొ రూబియో
భారత్కు కాల్సినంత
చమురు ఇస్తామని వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్లో తొలిసారిగా పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కొ రూబియో శనివారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా రూబియో వెంట వున్నారు. భద్రత, వాణిజ్యం, కీలకమైన సాంకేతికతలపై మోడీతో రూబియో చర్చలు జరిపారు. ఇంధన సహకార విస్తరణే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. భారత్లో పర్యటనకు బయలుదేరడానికి ముందుగానే రూబియో ఈ విషయం స్పష్టం చేశారు. భారత్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న రూబియో శనివారం ఉదయమే కోల్కతా చేరుకున్నారు. అక్కడ సెయింట్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం మదర్ హౌస్ను సందర్శించారు. అక్కడ 1950లో మదర్ థెరిస్సా ఏర్పాటు చేసిన, చారిటీ నిర్వహణలో వున్న నిర్మలా శిశుభవన్ను కూడా రూబియో దంపతులు సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. జైపూర్, ఆగ్రాల్లో కూడా రూబియో పర్యటించనున్నారు. అమెరికా-భారత్లమధ్య భద్రత, వాణిజ్యం, కీలకమైన సాంకేతికతలతో సహా పలు రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతాన్ని చేసేందుకు గల మార్గాలపై ఫలవంతమైన చర్చలు జరిపామని గోర్ తన ఎక్స్ పేజీలో తెలిపారు. అలాగే స్వేచ్ఛాయుతమైన, పారదర్శక ఇండో-పసిఫిక్ చొరవను మరింత ముందుకు తీసుకెళ్ళడంపై కూడా చర్చించామన్నారు. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైన భాగస్వామి అని గోర్ వ్యాఖ్యానించారు. గోర్ కోల్కతాలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో ఈ నాలుగు రోజుల పర్యటనలో విదేశాంగ మంత్రి జై శంకర్తో సమావేశమవుతారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు. రూబియోతో సమావేశానంతరం మోడీ కూడా ఎక్స్లో పోస్టు పెట్టారు. రూబియోతో భేటీ కావడం సంతోషంగా వుందని వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సుస్థిర పురోగతిపై ఇరువురం చర్చించినట్లు మోడీ తెలిపారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చలు జరిపామన్నారు. అంతర్జాతీయ ప్రయోజనాల కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. త్వరలో అమెరికా రావాల్సిందిగా ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరపున రూబియో ఆహ్వానం అందచేశారని గోర్ చెప్పారు. ఇరాన్ విషయంలో అమెరికాకు సాయం చేయడానికి నాటో తిరస్కరించడాన్ని రూబియో తీవ్రంగా నిరసించారు. అమెరికా భద్రతకు వారిచ్చే విలువ ఏమిటని ప్రశ్నించారు. ఇంధన సహకారాన్ని విస్తరించుకోవడంపై భారత్తో చర్చలు జరపనున్నట్లు గురువారం రూబియో ప్రకటించారు. ‘‘వారు కొనుగోలు చేసేంత ఇంధనాన్ని మేం విక్రయించాలని భావిస్తున్నాం. అమెరికా ఉత్పాదన, ఎగుమతులు చారిత్రక స్థాయిలో వున్నాయని భావిస్తున్నాం.’’ అంటూ భారత్ పర్యటనకు బయలుదేరడానికి ముందుగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. క్వాడ్ పట్ల నిబద్ధతతో వున్నట్లు రూబియో ప్రకటించారు. భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి వుందని తెలిపారు. మంగళవారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. స్వేచ్ఛాయుతమైన, పారదర్శక ఇండో-పసిఫిక్ ప్రాంతంపై చర్చలే ప్రధాన ఎజెండాగా వుంది.



