విద్యాసంస్థల బంద్ నిర్వహణ – విద్యార్థులపై లాఠీచార్జిని ఖండిస్తూ నిరసన
నవతెలంగాణ – ఉప్పునుంతల
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ శుక్రవారం ఉప్పునుంతల మండలంలోని ఉప్పునుంతల, కంసానిపల్లి, గట్టుకడిపల్లి విద్యాసంస్థల్లో బంద్ నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు చింతల నాగరాజు, డివైఎఫ్ఐ మండల నాయకుడు ఎస్.కె. పాషా తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేసి, పారదర్శక పరీక్షా వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 20 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయించి వందలాది మందిని గాయపరిచారని ఆరోపించారు. ఈ ఘటనలో బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని, నీట్ పేపర్ లీకేజీ కారణంగా మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అఖిల్, రాజు, గణేష్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.



