బెంగాల్‌లో టీఎంసీతో పొత్తు ఉండదు

– అక్కడ బీజేపీ, తృణమూల్‌కు వ్యతిరేకంగా పోరాడుతాం
సంఖ్యను పెంచుకోవడానికి ప్రతిచోటా చిన్న పార్టీల కోసం బీజేపీ వెతుకుతుంది సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణముల్‌ కాంగ్రెస్‌ తో ఎటువంటి పొత్తు ఉండదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఐక్యత కోసం ప్రతిపక్ష పార్టీలు సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీతో ఎలాంటి పొత్తు ఉండదని సోమవారం సీతారాం ఏచూరి పేర్కొన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌లతో పాటు లౌకిక పార్టీలు రాష్ట్రంలో బీజేపీతో పాటు టీఎంసీని ఎదుర్కొంటాయని తెలిపారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఇతర నేతలు హాజరయ్యే రెండు రోజుల సమావేశ వేదిక వద్ద విలేకరులతో మాట్లాడిన ఏచూరి 2004లో వామపక్ష-కాంగ్రెస్‌ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన విధానాన్ని ప్రస్తావించారు. ”ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ప్రయోజనం చేకూర్చే ఓట్ల విభజన తక్కువగా ఉండేలా చూడడమే మా ప్రయత్నం. ఇది కొత్త విషయం కాదు. 2004లో వామపక్షాలకు 61 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించి 57 గెలిచాం… ఆ తరువాత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు నడిచింది” అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌లతో పాటు లౌకిక పార్టీలు బిజెపి, టిఎంసిలకు వ్యతిరేకంగా పోరాడుతాయని ఆయన అన్నారు. ఇది ఏ రూపంలో ఉంటుందో తర్వాత నిర్ణయించబడుతుందని పేర్కొన్నారు. అలాగే 2004లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దారి తీసిన మార్గం కూడా ఇదేనని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో జరిగిన హింసాకాండపై వామపక్షాలు కూడా మమతా బెనర్జీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
బీజేపీతో పాటు 31 పార్టీలు ఉన్నాయని వాదిస్తున్నందుకు ఏచూరి ఈశాన్య రాష్ట్రాల్లోని అతిపెద్ద పార్టీలు, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే), అకాలీదళ్‌తో కలిసి లేవని అన్నారు. ఇప్పుడు వారు తమ సంఖ్యను పెంచుకోవడానికి చిన్న పార్టీలను తమవైపు లాక్కొనేందుకు ప్రతిచోటా వెతుకుతున్నారని ఏచూరి పేర్కొన్నారు. ప్రధాని మోడీపై ప్రతిపక్షాల ముఖం ఏమిటనే ప్రశ్నకు ఏచూరి సమాధానం ఇస్తూ 2004లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్థాయికి మించి లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించిందని గుర్తు చేశారు. ”ప్రతిపక్షాల ఐక్యత 2004 ఎన్నికల్లో లాంటిది. ప్రతిపక్షాల ముఖం విషయానికొస్తే, వాజ్‌పేయి వంటి ప్రజాకర్షక నాయకుడు బీజేపీకి ముఖంగా ఉన్నప్పుడు కూడా, 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని అయినప్పుడు మేము వారికి సమాధానం ఇచ్చాం” అని ఆయన అన్నారు. బెంగళూరులో జరిగే రెండు రోజుల సమావేశానికి 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు. అక్కడ ఉమ్మడి కనీస కార్యక్రమంపై చర్చ ప్రారంభించి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి ఆందోళన ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.

Spread the love