తెలంగాణ ప్రగతి ప్రతిబింబించేలా

‘దశాబ్ది’ సంబురాలు నిర్వహించాలి
– అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి పువ్వాడ పిలుపు
– తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని పల్లెపల్లెన ఆవిష్కరింపజేయాలి
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఅర్‌ ఆదేశానుసారం అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ పల్లెపల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని వారిని కార్యోన్ముఖులు చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్‌ అనుదీప్‌ అధ్వర్యంలో దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారి కృషితో గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను పునఃశ్చరణ చేసుకుంటూ ప్రజలకు వీటి గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను చేపడుతోందని అన్నారు. తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వివిధ వర్గాల ప్రజలకు చేకూరిన మేలు గురించి శాఖల వారీగా కరపత్రాలు, ఫ్లెక్సీలు, బుక్‌ లెట్ల ద్వారా తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమం ఉంటుందని, 3న అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం జరుపాలని, 4న పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దివస్‌, 5న విద్యుత్‌ విజయోత్సవం, 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ కారక్రమాలను నిర్వహించాలని వివరించారు. 9న తెలంగాణ సంక్షేమ సంబరాలను, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్‌, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.
20న తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో జెండాను ఎగురవేయాలని, విద్యాలయాలను అందంగా ముస్తాబు చేయాలని, విద్యార్థులకు బుక్స్‌, యూనిఫామ్స్‌ పంపిణీ చేయాలని, వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలని, మన ఊరు -మన బడి పనులు పూర్తయిన చోట పాఠశాలలను ప్రజాప్రతినిధులచే ప్రారంభోత్సవాలు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను అలంకరింపజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. 22న అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో సాగు రంగం ఐదింతలు అభివద్ధి చెందిందని అన్నారు. 2014 వరకు కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట సాగయ్యేదని, ప్రస్తుతం పంటల పెట్టుబడి, ఉచిత విద్యుత్‌, సాగు నీటి వసతి కల్పించడంతో 56 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తున్నారని వివరించారు. వరి సాగులో పంజాబ్‌ను సైతం అధిగమిస్తూ, దేశం మొత్తంలో యాభై శాతం ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రమే సాగు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. వ్యవసాయం అనే కాకుండా ఏ రంగాన్ని చూసినా కనీసం మూడింతల అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. అనంతరం కలెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంతం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మేల్యేలు వనమా వేంకటేశ్వర రావు, హరిప్రియ నాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల, ఐటీడీఏ పీవో గౌతమ్‌ పొట్రు, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ కాపు సీతా మాలక్ష్మీ, లైబ్రరీ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Spread the love