పారదర్శకతకే పెద్దపీట

Transparency is important– యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీ
– సహకరించాలని యూపీఎస్‌సీ చైర్మెన్‌ను కోరిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌
– రక్షణ భూముల బదలాయింపు, నిధులు విడుదలపై రక్షణ, ఆర్థిక శాఖ మంత్రులతో సమావేశం
– హస్తినలో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలు
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీఎస్సీ)కు సుమారు వందేండ్ల చరిత్ర ఉంది.. సుదీర్ఘ చరిత్రతో పాటు నిర్దిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్‌, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపట్టడం.. అన్నింటా పారదర్శకత పాటిస్తున్నది. ఈ విషయంలో మేం యూపీఎస్‌సీకి అభినందనలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)ను ఆ విధంగానే రూపొందించాలని నిర్ణయించుకున్నాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి యూపీఎస్‌సీ చైర్మెన్‌ మనోజ్‌ సోనికి తెలిపారు.
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
శుక్రవారం నాడిక్కడ యూపీఎస్‌సీ కార్యాలయంలో కమిషన్‌ చైర్మెన్‌ మనోజ్‌ సోని, కార్యదర్శి శశిరంజన్‌ కుమార్‌లతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన, యూపీఎస్‌సీ పని తీరుపై సుమారు గంటన్నర పాటు వారు చర్చించారు. యూపీఎస్‌సీ పారదర్శకత పాటిస్తున్నదని, అవినీతి మరక అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యూపీఎస్‌సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలను కుంటున్నట్టుతెలిపారు. తాము 2024 డిసెంబర్‌ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామనీ, ఇందుకు టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని చైర్మెన్‌ దృష్టికి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్‌, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి, దానినో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందన్నారు. ఫలితంగా పేపర్‌ లీక్‌లు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్ధతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చైర్మెన్‌, సభ్యుల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీలో అవకతవలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని వివరించారు. దీనికి స్పందించిన యూపీఎస్‌సీ చైర్మెన్‌ నియామకాల ప్రక్రియపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. యూపీఎస్‌సీ చైర్మెన్‌, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్‌తో పాటు సభ్యులకు శిక్షణ ఇస్తామనీ, సచివాలయ సిబ్బందికి అవగాహనా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్‌ రెడ్డి, టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్‌ పాల్గొన్నారు.
ఢిల్లీలో సీఎం బిజీబిజీ
గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు బిజీబిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పన కోసం జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను, హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖల మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీతో భేటీ అయ్యారు. రెండో రోజు శుక్రవారం యూపీఎస్‌సీ చైర్మెన్‌, కార్యదర్శితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌తో సమావేశంమయ్యారు. అనంతరం శుక్రవారం రాత్రి ఆయన న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
నిధులు విడుదల చేయండి
తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద 2019-20, 2021-22 నుంచి 2023-24 వరకు సంవత్సరానికి రూ.450 కోట్ల చొప్పున ఇవ్వాల్సిన రూ.1,800 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావల్సిన రూ.2,233.54 కోట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
రక్షణ శాఖ భూములు బదలాయించండి
హైదరాబాద్‌ నగరంలో రహదారులు, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం కలిశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతు బజార్‌ వద్ద స్కైవాక్‌ నిర్మిస్తున్నామనీ, ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమి 0.21 హెక్టార్లను బదిలీ చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆ భాగంలో మినహా స్కైవే నిర్మాణం పూర్తి కావస్తున్నందున ఆ భూమిని వెంటనే బదిలీ చేయాలని కోరారు. అందుకు రక్షణ శాఖ మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌-రామగుండంను కలిపే రాజీవ్‌ రహదారిలో ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి అవుటర్‌ రింగు రోడ్డు జంక్షన్‌ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్‌ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్‌ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి విజప్తిచేశారు. నాగ్‌పూర్‌ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్‌, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్‌ డెక్కర్‌ (మెట్రో కోసం) కారిడార్‌, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజప్తి చేశారు. ముఖ్యమంత్రి విజప్తులకు రక్షణ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love