– ఆర్ఎస్ఎస్ ‘గర్భ సంస్కార్’ కార్యక్రమానికి హాజరైన తమిళిసై
పుట్టకముందే విలువలు బోధిస్తారట !
న్యూఢిల్లీ : పిల్లలు పుట్టకముందే వారికి సాంస్కృతిక, దేశభక్తి విలువలు ప్రబోధిస్తానని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. అది ఎలా అంటారా? దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ రాష్ట్ర సేవిక సమితి ఆదివారం గర్భిణుల కోసం ‘గర్భ సంస్కార్’ పేరిట మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో తల్లులకు, వారి ద్వారా గర్భస్థ శిశువులకు విలువలు బోధిస్తారట!. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండే శిశువులు జన్మించాలంటే గర్ణిణులు సుందరకాండను పారాయణం చేయాలని, భగవద్గీత, రామాయణం, మహాభారతం చదవాలని ఆమె ఉద్బోధించారు. గర్భ సంస్కార్ కార్యక్రమంలో వైద్యులు కూడా భాగస్వాములవుతారట. వారు గర్భిణులకు అటు సైన్స్ పరంగా, ఇటు సంప్రదాయ పరంగా ప్రిస్క్రిప్షన్లు ఇస్తారు. ఇలాంటి వైఖరి సానుకూల ఫలితాలు ఇస్తుందని తమిళిసై చెప్పారు.