‘చరిత్ర’ ఎందుకిలా డీలా?

Why 'History'?‘ఎక్కడైతే చరిత్ర విస్మరించబడుతుందో…ఆ సమాజా నికి గతం, భవిష్యత్తు కూడా ఉండవు’ అని ప్రసిద్ధ రచయిత హిన్లీన్‌ అన్నాడు. ఇది అక్షరాల సత్యం. శాస్త్రీయ విజ్ఞానం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే వివాదాస్పదమవు తున్నది. ఈ నేపథ్యంలో దేశ అభివృద్ధికి మూలస్తంభమైన చరిత్రను నేడు విస్మరిస్తున్నదనే విమర్శ వస్తున్నది. దానికి సాక్ష్యం నేడు చరిత్ర డీలా పడటం. కేంద్ర మానవ వనరుల శాఖ నేతత్వంలో ఎన్‌సిఇఆర్‌టి (జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి) 1961 నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిగతా సబ్జెక్టులతో పాటు చరిత్రకీ ఉన్నత స్థానాన్ని కల్పించి బోధన సాగిస్తోంది. ఎన్‌సిఇఆర్‌టి సూచనల మేరకు ఆయా రాష్ట్రాల్లో ఎస్‌సిఇఆర్‌టి (రాష్ట్ర విద్యా శోధన, శిక్షణ సంస్థ)లు సిలబస్‌ తయారు చేసుకుని చరిత్రను బోధిస్తున్నాయి. ఆరం భంలో అన్ని కళాశాలలో చరిత్ర మెయిన్‌గా ఉండే హెచ్‌ఇసి గ్రూపులు విద్యార్థులతో కళకళలాడుతుండేవి. సైన్స్‌ కంటే ఎక్కువ విద్యార్థులు హిస్టరీ ఉన్న ఆర్ట్స్‌ గ్రూపుల్లోనే చేరేవారు. గతంలో ‘లా’ చదవాలంటే కచ్చితంగా హిస్టరీ గ్రూప్‌ నుంచి వెళ్లేవారు. ఇప్పుడు సైన్స్‌ గ్రూపుల నుంచి ఎక్కువమంది ‘లా’ చదువుతున్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి పరీక్షలు హిస్టరీ చది విన వాళ్ళు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు సర్వం ఇంజనీరింగ్‌ గా మారుతోంది. ఐసిహెచ్‌ఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ హిస్టా రికల్‌ రీసెర్చ్‌) సంస్థ మన దేశంలో జాతీయ స్థాయిలో చరిత్ర ను పరిశోధిస్తూ కొన్ని ఆధునిక విషయాలను ఎన్‌సిఇఆర్‌టి ద్వారా ఎస్‌సిఇఆర్‌టిలకు అందిస్తూ వుంటుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో కీలుబొమ్మై రాజకీయ రంగు పులు ముకుంటోందని తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్‌సిఇఆర్‌టి చరిత్రలో కొన్ని కీలక పాఠ్యాంశాలు తొలగించడం ఇటీవల దేశవ్యాప్తంగా విమ ర్శలకు, నిరసనలకు దారితీసింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర బోధన మీద శీతకన్ను వేస్తూనే ఉన్నాయి.
ఈ గందరగోళాల నేపథ్యంలో చరిత్ర బోధన ప్రాబల్యం కోల్పోతూ వస్తోంది. రోజురోజుకి చరిత్ర గ్రూప్‌ చదివే విద్యా ర్థుల సంఖ్య తరిగిపోతోంది. ఇప్పటికే చాలా కళాశాలల్లో చరిత్ర చదివే విద్యార్థులు లేక హిస్టరీ గ్రూపుని మూసేశారు. రాబోయే పరిణామాలను పసిగట్టిన అప్పటి కేంద్ర ప్రభుత్వం 1986లో డిగ్రీ చదివే విద్యార్థులందరికీ రెండు కంపల్సరీ సబ్జెక్టులను ప్రవేశపెట్టింది. సైన్స్‌ విద్యార్థులకు ఆర్ట్స్‌ పట్ల, ఆర్ట్స్‌ విద్యా ర్థులకు సైన్స్‌ పట్ల కనీస అవ గాహన కోసం ఐహెచ్‌సి (భార తీయ సంస్కృతీ వారసత్వం), సైన్స్‌ అండ్‌ సివిలైజేషన్‌ (విజ్ఞానము, పౌరస్మృతి) సబ్జెక్టులు కచ్చితంగా బోధించి తీరా లని నిబంధన పెట్టింది. 2020 తర్వాత నుంచి ఇది ‘ఇండి యన్‌ కల్చర్‌ అండ్‌ సైన్స్‌’ పేరిట ఏక సబ్జెక్టుగా మారింది. ఇంతవరకు బానే ఉంది. దీన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా పరిగణించ డంతో కొందరే ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకుంటున్నారు. దీంతో హిస్టరీ ఉనికిపై మరో రాయి పడింది. సాఫ్ట్‌వేర్‌ మోజులో విద్యార్థులు సాధారణ డిగ్రీల కంటే బిటెక్‌ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంజనీరింగ్‌ చదువుల ముందు చరిత్ర డీలా పడుతోంది. సైన్సు, ఆర్ట్స్‌, ఇంజనీరింగ్‌ ఇలా చదువుకునే వారందరికీ చరిత్ర పరిజ్ఞానం చేరాలంటే… తెలుగు, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ మాదిరిగా హిస్టరీని కూడా ఒక కంపల్సరీ సబ్జెక్టుగా నేర్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
ఆధునిక సాంకేతిక యాంత్రిక యుగంలో మానవుడు చంద్రుడు మీదకు సైతం దూసుకుని వెళ్తూ ఉంటే జరిగి పోయిన గతాన్ని తవ్వుకుంటూ చరిత్ర ఎందుకు? అనే విమ ర్శలు లేకపోలేదు. ఒకవైపు పెత్తందారులు, కార్పొరేట్‌ సంస్థలు, దళారులు చేతికి అందింది దోచుకుంటున్నారు. ఎంత కష్టపడ్డా రైతులకు, శ్రామికులకు పూట గడవడం కష్టంగా మారిపో తుంది. సమాజంలో అంతరాలు పోయి సమ సమాజ స్థాపన జరగాలి అంటే దానికి చరిత్ర ఒక సాధనం. సాంఘిక శాస్త్రాన్ని (సోషల్‌ సైన్సెస్‌) చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఒక పరిణితి గల సమాజం ఏర్పడుతుంది. అమెరికన్‌ ప్రముఖ రచయిత్రి పెరల్‌.ఎస్‌.బక్‌ ఏమన్నారంటే… ‘ఇవాళ్టి గురించి నీవు అన్వేషించాలనుకుంటే కచ్చితంగా నీవు నిన్నటి గురించి తెలుసుకుని ఉండాలి’. గతం అంటే… చరిత్ర ఎప్పుడూ కూడా గొప్పదే. ‘గతం పునాదుల మీదే వర్తమానం నడుస్తుంది, భవి ష్యత్తు నిర్మితమవుతుంది’. ఇదే చరిత్ర మూల సిద్ధాంతం.
భవిష్యత్‌ సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే చరిత్ర సబ్జెక్టుకు కళాశాలల్లో పూర్వ వైభవం దక్కాలంటే ప్రభుత్వాలు కచ్చితంగా ప్రత్యేకదష్టి సారించాలి. చరిత్ర చదువుకున్న విద్యా ర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకో వాలి. పురావస్తు శాఖ, పర్యాటకం, అటవీ శాఖ, పోలీసు శాఖ తదితర రంగాల్లో హిస్టరీ విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించాలి. కాంట్రాక్ట్‌, ప్రైవేట్‌ బోధకులతో కాకుండా నిష్ణాతులైన రెగ్యులర్‌ లెక్చరర్లను నియమించి కళాశాలల్లో వారితో పాఠ్యాంశాలు బోధించేటట్టు చూడాలి. ప్రభుత్వ కళాశాలల్లో హిస్టరీ గ్రూపు నడుపుతూ వాటిలో విద్యార్థులు చేరేలా ప్రభుత్వం ప్రచారం కల్పించాలి. ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో కూడా కచ్చితంగా హిస్టరీ గ్రూపులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హిస్టరీ స్కాలర్లని కూడా పెంచాలి. హిస్టరీ, సైన్స్‌ సబ్జెక్టుల కాంబినేషన్‌తో కొత్త గ్రూపులు ఏర్పాటుచేసి విద్యార్థులకు దగ్గర చేయాలి. హిస్టరీ ప్రాభవాన్ని, అవసరాన్ని తెలిపి విద్యార్థుల్లో చరిత్ర చదవడానికి ఆసక్తి రేకెత్తించాలి.
– చిలుకూరి శ్రీనివాసరావు
సెల్‌: 8985945506

Spread the love