సామాజికి మార్పు, సానుకూల దృక్పథం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సామాజిక మార్పు, సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కీలకపాత్ర పోషిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్రంజన్ అన్నారు. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్(ఏఐ) మిషన్ ఆధ్వర్యంలో ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్’ అవార్డుల విజేతలను ప్రకటించింది. ఆ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు సోమేష్ కుమార్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని టీ-హబ్లో నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి 15 విజయవంతమైన ఆవిష్కరణల సంకలనమైన ‘ఫ్రం కోడ్ టు కంపాషన్’ను ఈ సందర్బంగా ప్రారంభించారు. అనంతరం జయేష్రంజన్ మాట్లాడుతూ ఈ పోటీల్లో వినూత్న పరిష్కారాలు, విధానాలు, ఈ క్లిష్టమైన ప్రాంతాలను విప్లవాత్మకంగా మార్చగల శక్తిని కలిగిన స్టార్టప్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను అవి మెరుగుపరుస్తాయని అన్నారు. సమాజాభివృద్ధి కోసం నిబద్దతతో స్టార్టప్లను తయారుచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించా రు. తెలంగాణ ఏఐ మిషన్ అనేది తెలంగాణ ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఎమర్జింగ్ టెక్నాల జీస్ వింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, హైదరాబాద్లను గ్లోబల్ ఏఐ హబ్గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవిలంక, కాప్జెమినీ వైస్ప్రెసిడెంట్ అనురాగ్ప్రతాప్, నాస్కామ్ ఫౌండేషన్ సీఈఓ నిధి బాసిన్, లీడ్-తెలంగాణ ఏఐ మిషన్ ప్రతినిధి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
స్టార్టప్లు ఇలా…
ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, స్థిరమైన వాతావరణంలో పనిచేస్తున్న ఏఐ స్టార్టప్ల నుంచి 128 నామినేషన్లను స్వీకరించారు. గెలుపొందిన మూడు స్టార్టప్లలో ప్రతి ఒక్కటి సామాజిక రంగం కోసం ఆవిష్కరిం చబడిందని నిర్వాహకులు తెలిపారు. ఒక్కోదానికి రూ.7లక్షల సీడ్ ఫండింగ్తో అవార్డు అందజేశారు. హెల్త్ అండ్ శానిటేషన్ విభాగంలో స్పార్కోలైఫ్ డిజిటల్ హెల్త్ టెక్నాలజీస్ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ స్టార్టప్ మహిళల శ్రేయస్సు, పునరుత్పత్తి ఆరోగ్యం, సంతానోత్పత్తి సంరక్షణ కోసం పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు.