నవతెలంగాణ – రాంచీ: రాంచీలో పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది చిన్నారులు గాయాలపాలయ్యారు. రాంచీలోని సదర్ సబ్ డివిజన్లోని మందార్ సీడీ బ్లాక్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 మంది పిల్లలతో వెళ్తున్న బస్సు మందార్లోని సెయింట్ మారియా స్కూల్కు 100 మీటర్ల దూరంలో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు మందార్ పోలీస్ స్టేషన్ అధికారి రాహుల్ తెలిపారు. బస్సులోని మిగతా పిల్లలంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.