– ఉమర్ ఖాలీద్ బెయిల్ పిటిషన్ విషయంలో అనూహ్య పరిణామం
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లలో ఉమర్ ఖాలీద్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై జరగనున్న బెయిల్ పిటిషన్ను విచారణలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పి.కె. మిశ్రా ఈ బెయిల్ పిటిషన్ విచారణ నుంచి తనంతట తాను తప్పుకున్నారు. దీంతో జస్టిస్ ఎ.ఎస్.బోపన్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. ఇది వేరే బెంచ్ ముందుకు వస్తుందని జస్టిస్ బోపన్న అన్నారు. తదుపరి న్యాయమూర్తుల కూర్పుతో ఆగస్టు 17న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. అయితే, ఈ పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ మిశ్రా తప్పుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
ఉమర్ ఖాలీద్ ఇప్పటికే 1050 రోజులు జైలులో ఉన్నాడు. అంతేగాక, ఆయనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు మోపారు. బెయిల్ కోసం ఆయన చేసిన పిటిసన్ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు గతేడాది మార్చిలో తిరస్కరించింది. అతను గతేడాది
విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి అక్టోబర్లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు సైతం ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో విద్యార్థి నాయకుడు ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ అంశం మే 18న మొదటిసారిగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన తర్వాత, ఢిల్లీ పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కోరడంతో గతనెల 12న ఒకసారి, ఆపై అదే నెల 24న మరోసారి వాయిదా పడింది.
జస్టిస్ మిశ్రా ఈ ఏడాది మే 19న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అల్లర్లకు సంబంధించిన కేసుల్లో కల్పిత సాక్ష్యాలపై గుజరాత్ పోలీసు ఎఫ్ఐఆర్లో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై జస్టిస్ ఎ.ఎస్ ఓకాతో విభేదించినందుకు ఆయన చివరిగా వార్తల్లో నిలిచారు. దీంతో ఈ కేసును త్రిసభ్య ధర్మాసనం విచారించగా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.