నేడు దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీకి…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం హైదరాబాద్కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఘన స్వాగతం లభించింది. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేటకు చేరుకున్న ఆమెకు గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతికి వారు శాలువాలు కప్పి సన్మానించారు. ఆమెకు స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, జీహెచ్ఎమ్సీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి అక్కడే బస చేయనున్న ఆమె…శనివారం దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో రివ్యూయింగ్ ఆఫీసర్గా పాల్గొంటారు. అనంతరం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.