తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న యూత్ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘అహింస’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ నిర్మించారు. గీతికా తివారీ కథానాయిక. ఈనెల 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తేజ మీడియాతో మాట్లాడుతూ, ‘అభిరామ్ని హీరోగా పరిచయం చేయడనికి కారణం రామానాయుడు గారికి నేను మాట ఇచ్చాను. ఆ మాట కోసమే చేశాను. ఇదొక ఫిలాసఫీని బేస్ చేసి చేసిన కథ. అహింస వాదంపై సరైన క్లారిటీ లేదు. దేశంలో చాలా హింసాత్మక సంఘటనలు జరిగాయి. అహింస వాదాన్ని ఫాలో అయితే అవి జరగకూడదు. ఫాలో కాకపోవడానికి కారణం.. మనకి అది అర్థం కావడం లేదు. దానిని క్లారిటీగా చెప్పలేదు. అసలు అది కరెక్టా కాదా? దాన్ని ఎలా ఫాలో అవ్వాలి? అనే కాన్సెప్ట్ని పట్టుకొని మంచి కమర్షియల్ కథగా దీన్ని చేశాం. మధ్యప్రదేశ్ అడవుల్లో షూటింగ్ చేశాం. అక్కడ లోకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పటివరకూ ఏ సినిమాలో రాలేదు. కథ చెప్పినపుడు విజువల్, ఆడియో, నేపథ్యం అన్నీ కొత్తగా ఉండాలని అక్కడ షూట్ చేశాం. కథాపరంగా ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కథలో భాగంగా వెళ్తుంటాయి. ఇందులో ఓ నాలుగు ఎపిసోడ్స్కి నేనే ఫైట్ మాస్టర్గా చేశాను. హీరోకి వచ్చిన అడ్డంకుల్ని ఎదుర్కొని తాను అనుకున్న ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇన్ని ఫైట్స్ తప్పలేదు. ఈ కథలో అభిరామ్ బాగా అమరాడు. వెంకటేష్, రానాలతో పోల్చినప్పటికీ ఓ కొత్త హీరోగా తాను చేయాల్సింది చేశాడు. ఆర్పీ పట్నాయక్ చాలా పాటలు ఇచ్చారు. అనూప్ నేపథ్య సంగీతం చేశారు. ఇద్దరూ కలిసే చేశారు. ఈ సినిమా తర్వాత రానాతో ‘రాక్షస రాజు’ అనే టైటిల్తో సినిమా అనుకుంటున్నాం. పాలిటిక్స్, క్రైమ్ నేపథ్యంలో ఉంటుంది. ఆచంట గోపీనాథ్ దీనికి నిర్మాత. ఈనెల 6 రామానాయుడు పుట్టిన రోజు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని రానా అన్నారు’ అని తెలిపారు.