‘మరణశయ్యపై అమ్మ భాష’

'Mother's Language on Deathbed'భాష మానవ సంస్కృతి, నాగరికతలకు ప్రతిరూపం. భాష మానవులకు ఉండే ప్రత్యేక లక్షణం. ఇది భావ వాహిక, దీనిని మనం ఆలోచించటానికి, సమస్యలు పరిష్కరించటానికి, ఆడుకోవడానికి, కలలు కనడానికి, వ్యాఖ్యానించ టానికి, ఉద్వేగాల వ్యక్తీకరణకు, సమాచారం పంచుకోవటానికి ఉపయోగించు కుంటాం. పిల్లలందరూ నాలుగేండ్ల వయస్సు నాటికే భాష విషయక పరిణతిపొంది ఉంటారు.పిల్లలు సహజంగా భాషా సామర్థ్యాలతో జనించినప్పటికీ, ఆయా భాషలకు వాటి సామాజిక నేపథ్యంలోనే సంపాదిస్తారు. సమాజం లేకుండా భాషలేదు, సమాజం మారితే భాష కూడా మారుతుంది. ఆంధ్రదేశం అపారమైన సహజ, మానవ వనరులు కలిగిన ప్రాంతం. దాదాపు మూడువేల సంవత్సరాల లిపి, భాష, శాసనాలు, చారిత్రిక, సాంస్కృతిక వికాసం. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని మన పండితులు ఆనాడే చెప్పారు. ఇంతటి గొప్ప బాష సంస్కృతి, సాహిత్యం మొత్తంగా తెలుగు సంస్కృతి నేడు మరణశయ్యపై ఉందంటే బాధగా ఉంది. ఈ పరిస్థితి దాపురించటానికి గల కారణాలు చారిత్రక దృక్పథంతో చూడాల్సి ఉంటుంది.
పూర్వం ఆనాడు గురుకులాశ్రమాలు విలువైన విద్యనందించాయి. నలందా, తక్షశిలా లాంటి విశ్వ విద్యాల యాలు ఆ సమాజానికి అవసరమైన మంచి విద్యను అందించాయి. విదేశీ యాత్రకుడు (హ్యూయన్‌ త్సాంగ్‌) కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి, విజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఎంతోమంది విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. ఆనాటి రాచరిక వ్యవస్థ అన్ని సౌకర్యాలు సమకూర్చింది. మహమ్మదీయుల పాలనలో కూడా కొద్ది మార్పులతో ఇదే విధానం కొనసాగింది. విద్య ఇంత ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం మన దేశంలో విద్యను మాతృభాషలో బోధించటమే. బ్రిటిష్‌వారి రాకతో సామ్రాజ్యవాదం అడుగుపడింది. ఇది వలసపాలన, పాత వ్యవస్థను నాశనం చేసింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయటానికి, విద్యను విలువలేని సరుకుగా మార్చటానికి వారికి అవసరమైన గుమస్తాలు తయారు చేయటానికి, నూతన విద్యావ్యవస్థ మెకాలేను ప్రవేశపెట్టింది. మెకాలే ఇక్కడి విద్యావ్యవస్థను, అందులోని నైతికత విలువలు చూసి ఆశ్చర్యపోయి ఇక్కడి విద్యా వ్యవస్థను, సంస్కృ తిని, భాషను ధ్వంసం చేయకుండా ఏమి సాధించలేమనే విషయాన్ని గ్రహించాడు. మెల్లగా ధన సంపాదనే మార్గంగా, ఏ నైతిక విలువలకు స్థానం లేకుండా, భారతీయ సంస్కృతీ, నాగరికతలను ఫణంగా పెట్టి ఆంగ్ల మాద్య మాన్ని ప్రవేశపెట్టాడు. ఇందుకు సాక్ష్యం మెకాలే. 2 ఫిబ్రవరి 1835న బ్రిటిషు పార్లమెంటుకు రాసి పంపిన లేఖలోని సారాంశం ఇది… ”భారతదేశంలో తూర్పు-పడమరల ప్రయాణించాను. నాకెక్కడ ఒక దొంగగాని, ఒక భిక్షువుగాని కనిపించలేదు. అపారమైన సంపద కలిగి ఉన్న భారతదేశం. వీరికున్న నైతిక విలువలే వారికున్న బలమైన శక్తి, దీన్ని బట్టి నేను ఏమనుకొంటున్నాను అంటే…ఈ దేశాన్ని మనం ఎన్నడూ జయించలేం. ఈ దేశానికి వెన్నెముకలా నిలిచినటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపదను, ప్రాచీన విద్యావిధానాన్ని మరిపించే దాని స్థానంలో ఇంగ్లీషు ఎంత ఉన్నతమైనదని, భారతీయులు ఆలోచించేలా వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా, వారి సహజ సంస్కృతుల స్థానంలో మనమనుకొన్న వాటిని ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే మనం ఈ దేశాన్ని పూర్తిగా జయించగలం” అని పైవిధంగా 1835లో సాక్ష్యాత్తు లార్డ్‌ మెకాలే బ్రిటిష్‌/ పార్లమెంటుకు పంపిన లేఖ పేర్కొన్నాడు.
స్వాతంత్య్రానంతరం ఇప్పటికి మెకాలే విద్యావిధానమే అమల్లో ఉంది. ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీషు భాష సునామీలా మనదేశంపై విరుచుకు పడ్డాయి. 1991లో నూతన ఆర్థిక విధానాలు దీనికి పూర్తిగా ఊతమిచ్చాయి. దీనికి కారణం సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ. ఇవ్వాళ మంచి ఇంగ్లీషు ఎవ్వరికి రాదంటే ఆశ్చర్యపడ నవసరం లేదు. 1947కి ముందు మనం నేరుగా ఇంగ్లీషు వారినుంచి నేర్చుకొనేవారం. కాని ఇవ్వాళ ఇంగ్లీషు రాని వారి నుంచి ఇంగ్లీషు నేర్చుకుంటున్నాం. మాతృభాషలో విద్యాబోధన పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించి, వికాసానికి తోడ్పడుతుంది. మాతృభాషలో ప్రావీణ్యం లేకుండా, మాతృభాష రాకుండా ఏ విద్యార్థి అయినా సర్వముఖ వికాసం చెందటం కానిపని. మాతృభాషలకు దూరమై చదివే తరాలలోంచి తాత్వికులు, రచయితలు, మంచి నాయకులుగా వచ్చే అవకాశం లేదు. అభివృద్ధి చెందాయని చెప్పబడే దేశాలు తమ మాతృభాషలను వదులుకొని ఇంగ్లీషును కౌగిలించుకొన్నవి కాదు. మాతృభాషా, సంస్కృతులను వదులుకొన్న ఏ జాతికి మోక్షం లేదు. మాతృభాష రాకుండా ఎంత విద్యా వంతుడైనా సరే నిరక్షరాస్యుడే. ఇతర భాషలు బాగా రావాలంటే మాతృభాష బాగా రావటం శాస్త్రీయం. ఇంకా అమ్మభాష ప్రాధాన్యత చెప్పుకోవాలంటే మానవ సమాజ వికాసంలో మాతృభాష ఎడల శాస్త్రీయ వైఖరి, అవగాహన లేకపోయినట్లయితే మనం సుడిగుండంలో పడిపోతాం. అందుకే కార్పొరేట్‌ ఆంగ్లమాధ్యమాన్ని అర్థం చేసుకొని, హేతుబద్ధమైన చారిత్రక పునాదిపై నిలబడి ఆలోచించాలి. లేదంటే మంచి వ్యక్తిత్వం గల నాణ్యమైన భావితరం మనకు అందదు. ఇది భవిష్యత్‌ తరాలకు తీరని నష్టాన్ని మిగిలిస్తుంది.
పిల్లల్లో విషయ పరిజ్ఞానానికి ఇంటి భాష కీలకమైంది. పిల్లల్లో పుట్టుకతోనే సహజమైన మాతృభాష అభ్యాసన కలిగి ఉంటారు. వాస్తవం ఇది. కాగా విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుగుభాష పట్ల మొగ్గుచూపక పోవడానికి కారణాలేమిటో మనం పరిశీలించాలి. విదేశీ సామ్రాజ్యవాద సంస్థలకు చౌకగా కూలీలను సమకూర్చే ఇన్ఫోసిస్‌, సత్యం, విప్రో లాంటి సంస్థల్లో ఎక్కువైంది. ఈ సంస్థలు చేస్తున్న ఊడిగం అమెరికా, యూరప్‌ దేశాల సంస్థ లకు కాబట్టి ఆంగ్లభాషలో ప్రావీణ్యం ఉన్నవారికే ఉద్యోగాలున్నాయి. తద్వారా జ్ఞాన సముపార్జన కన్నా, కంప్యూటర్‌ విద్యా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం ఏర్పడింది. భారతీయ యువత ఆంగ్లబాబులుగా, డాలర్‌ బాబులుగా మారి విదేశీ దేశాలకు ఊడిగం చేయటానికి తహతహలాడుతున్నారు. తద్వారా పరోక్షంగా మాతృదేశానికి ద్రోహం చేస్తు న్నారు. మరోవైపు యూరప్‌, అమెరికా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా సాఫ్ట్‌వేర్‌రంగం కుప్ప కూలటంతో డాలర్స్‌ డ్రీమ్స్‌ చెదిరిపోయి తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురై ఆత్మహత్యలకు పాల్పడి జీవితాన్ని ముగిస్తున్నారు.
భాషా అభిమానులు ప్రజలు తల్లిభాషను అధికార భాషగా తన దేశభాషను జాతీయ భాషగా ఉండాలని కోరుకోవాలి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్న అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో ఇదే పద్ధతి అమల్లో ఉన్న విషయం గమనించాలి. మొత్తం విద్యా వ్యవస్థ వారి వారి మాతృభాషలలో జరగాలి. ఇందుకు మొత్తం సమస్థ జ్ఞాన సంపదను, దేశీయ, ప్రాంతీయ భాషల్లో తర్జుమా కావాలి. ప్రాంతీయ భాషలలో చదువుకొన్నవారికి మెండుగా ఉపాధి అవకాశాలు లభించే వ్యవస్థ నిర్మాణం జరగాలి. తక్షణ కర్తవ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అసలు ప్రభుత్వ, ప్రయివేటు అనే రెండు రకాల విద్యా వ్యవస్థలు, మీడియంలు లేకుండా ప్రజలందరికి ఒకే రకమైన విద్యను నెల కొల్పాలి. డాక్టర్‌ డి.ఎస్‌.కొఠారి చెప్పిన (కొఠారి కమిషన్‌ 1964-1966, సిఫార్సులు) ”కామన్‌ స్కూల్‌” విధానంలో నైబర్‌ హుడ్‌ పాఠశాలల్లో దేశ ప్రధాని మొదలు ముఖ్యమంత్రి, టీచర్లు, రిక్షాకార్మికుల వరకు తమ పిల్లలందరినీ అవాస ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివించగలిగితే నెహ్రూజీ కలలు కన్నా నిజమైన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుంది. అంతేకాక, మొత్తం దేశీయ భాషల మనుగడకై ఎసరుపెట్టి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలైన ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దీనికి అన్ని వర్గాల ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పి కదిలించి, సమర్థ వంతంగా ఎదుర్కొంటే తప్ప భిన్న సంస్కృతులు, భాషలు, మనుగడలో ఉండవు. ఇది ఒక దీర్ఘకాలిక లక్ష్యం. ఏ భాష ఇతర బాషల కన్నా గొప్పది కాదు. ప్రతీ భాషకు అది ఎంత తక్కువ మంది జనాభా మాట్లాడేది అయినా, దాని విశిష్టత, ప్రాముఖ్యత దానికి ఉంటాయి. విభిన్న జాతుల మేలు కలయిక మన దేశం ప్రతి జాతి స్వతంత్రంగా ఎదిగే అవకాశం కల్పించినప్పుడే ఆ జాతి, ఆ భాష వెల్లివిరుస్తాయి. దానికై ఆంగ్లభాషా గుత్తాధిపత్యాన్ని మనం తొలగించాల్సి ఉంటుంది. ఇదే తెలుగు భాషా అభిమానుల, ప్రజల తక్షణ కర్తవ్యం కావాలి.
(ఆగస్టు 29 తెలుగుభాషా దినోత్సవం)

ఎల్‌. అపర్ణ
9705493054

Spread the love