కుక్కల దాడిలో బాలుడు మృతి…

కాజీపేట: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేక్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్‌ దంపతులు అజ్మీర్‌ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్‌కు వచ్చారు. సంచార జాతులైన వీరు.. వంట చేసుకునేందుకు రైల్వేస్టేషన్‌ పక్కనే ఉన్న పార్కుకు గురువారం రాత్రి చేరుకున్నారు. ఉదయం నిద్రలేచిన తర్వాత బహిర్భూమికని పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి చోటూ వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆరు వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. చెట్టు కొమ్మకు దుస్తులు చిక్కుకోవడంతో చోటూ ఎటూ కదల్లేక కింద పడిపోయాడు. ఎంత అరిచినా ఎవరికీ వినిపించకపోవడంతో కుక్కలు సుమారు 15 నిమిషాల పాటు బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Spread the love