– పట్టాలిచ్చే 135వ జయంతి సందర్భంగా సీఎం నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అనీ, దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతిని పురస్కరించుకొని సోమవారం సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మహనీయుడు భాగ్యరెడ్డి వర్మను గౌరవించుకోవడంతో పాటు వారి స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించేందుకు వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల కోసం పాఠశాలలను స్థాపించి వారి విద్యాభివృద్దికి, ఉన్నతికి ఆయన గట్టి పునాదులు వేశారన్నారు. దళితజాతి విద్యా వికాసానికి, సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి భాగ్యరెడ్డి వర్మ విశేషంగా కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఎస్సీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని చెప్పారు. షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక ప్రగతి నిధి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు టీఎస్ ప్రైడ్, నిరుపేద ఎస్సీ కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్, ఎస్సీలకు గొప్ప భవిష్యత్ ను అందించేందుకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యాబోధన వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలతో ఎస్సీల సమగ్రాభ్యున్నతికి ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని తెలిపారు.