చంద్రముఖి 2 ఘన విజయం ఖాయం

Chandramukhi 2 Great success is guaranteedరాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో అలరించున్నారు. పి.వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్‌ 15న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ, ‘పెద్ద పెద్ద స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌ నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ ఇలాంటి ఓ గొప్ప సినిమాను లార్జర్‌ దేన్‌ లైఫ్‌ మూవీలా నిర్మించారు. ఆయన బ్యానర్‌లో సినిమా చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమా సాధించే విజయం మా దర్శకుడు వాసుకే దక్కుతుంది. కంగనా రనౌత్‌ ఈ సినిమాలో నటిస్తారని తెలియగానే ఆశ్చర్య పోయాను. అద్భుతంగా ఆమె తన పాత్రలో ఒదిగి పోయారు. కీరవాణి, సినిమాటో గ్రాఫర్‌ రాజశేఖర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ తోట తరణి, ఎడిటర్‌ ఆంటోని సహా అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ‘చంద్రముఖి 2′ వంటి గొప్ప సినిమా చేశాం’ అని తెలిపారు.
‘నేను నటిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఇన్నేళ్లలో ‘చంద్రముఖి 2′ వంటి సినిమా చేయలేదు. తొలిసారి ఇలాంటి పాత్ర కోసం దర్శకుడు వాసు నన్ను సంప్రదించడం ఆనందంగా ఉంది. ఆయన నా పాత్రతో పాటు ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిం చారు. లారెన్స్‌ చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేషన్‌. నిర్మాత సుభాస్కరన్‌ చాలా ప్యాషన్‌తో గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు’ అని నాయిక కంగనా రనౌత్‌ అన్నారు.
డైరెక్టర్‌ పి.వాసు మాట్లాడుతూ, ”డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే ఈ చిత్రాన్ని రూపొందించాను. లైకా ప్రొడక్షన్స్‌ అంటేనే అద్భుతం. బ్రహ్మాండమైన సినిమాలను నిర్మించారు. నిర్మిస్తున్నారు. సుభాస్కరన్‌ తమిళ చిత్ర సీమకు దొరికిన గొప్ప నిధి. ఆయన నిర్మించిన ఈ చిత్రం సైతం గొప్ప ఘన విజయం సాధించడం ఖాయం’ అని తెలిపారు. ”నేను ఈ మధ్య కాలం సినిమా రంగానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ సినీ ఇండిస్టీలోకి అడుగు పెట్టాను. మామన్నన్‌ సినిమా తర్వాత ఈ సినిమాతో అలరించబోతున్నాను’ అని హాస్య నటుడు వడివేలు చెప్పారు.
ఆస్కార్‌ అవార్డుతో భారతీయ సినిమా పరిశ్రమను ఖ్యాతిని పెంచిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం.కీరవాణికి, నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న దర్శకుడు పి.వాసుకి లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌ సన్మానం చేశారు.
అలాగే లారెన్స్‌కి సంబంధించిన వికలాంగుల ఛారిటీకి నిర్మాత సుభాస్కరన్‌ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు.

Spread the love