నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్లో దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు షెడ్యూల్ను ప్రకటిస్తారు. గతనెల 24న ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 5,02,280 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,22,432 (64.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2,47,358 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,79,412 (72.53 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,54,922 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,43,020 (56.10 శాతం) మంది పాసయ్యారు.