వారం రోజుల్లో డబుల్‌..

– లబ్దిదారుల ఎంపికలో రాజకీయ ప్రమేయం ఉండదు : మంత్రి కేటీఆర్‌
– ఇండ్ల నిర్మాణం, పంపిణీపై ఉన్నత స్థాయి సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
వచ్చే వారంలోనే తొలి దశ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదన్నారు. అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హులను గుర్తిస్తుందని, ఇందులో ఆరోపణలకు తావులేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో ఇండ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 70వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్దిదారులకు అందించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని జీహెచ్‌ఎంసీ అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వెరిఫికేషన్‌ పక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఇందులో సుమారు 4500కు పైగా ఇండ్లను లబ్దిదారులకు అందించామన్నారు. నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో అందిస్తామని తెలిపారు. వచ్చే వారంలోనే తొలి ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ప్రక్రియ పంపిణీపై మంత్రులు పలు సూచనలు చేశారు. కేటాయించనున్న ఇండ్ల వద్దనే లబ్దిదారులందరికీ అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్దిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే విషయాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love