– లిక్కర్ కేసులో కవితకు బెయిల్ దొరకదు
– త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకు
– రాష్ట్రంలో బీజెపీ, బీఆర్ఎస్కు కాలం చెల్లింది
– సంస్కారహీనుడు జగదీశ్రెడ్డి గురించి ఇక మాట్లాడను: మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ కలెక్టరేట్
”కేసీిఆర్ బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా భువనగిరి, నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదు.. లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు బెయిల్ దొరకదు. త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయం..” అని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్కు కాలం చెల్లిందన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో తామే గెలవబోతున్నామన్నారు. తనను గెలిపించిన విధంగానే అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్, మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. సంస్కారహీనుడైన జగదీశ్రెడ్డి గురించి ఇక మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోనని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్గా పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నీటి జలాల పంపకంలో జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారని విమర్శించారు. కేసీఆర్ వల్లే జిల్లాకి కరువు వచ్చిందని, మిర్యాలగూడకి కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని వస్తారని, బస్సు యత్ర చేయడానికి కేసీఆర్కి సిగ్గుండాలని అన్నారు. కేసీఆర్ శకం ఇక ముగిసిందన్నారు. తాను పిలిస్తే కాంగ్రెస్లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు.
మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీి రాజకీయాలు చేస్తోందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల గురుంచి, జగదీశ్ రెడ్డి గురించి గుత్తా సుఖేందర్ రెడ్డి సరిగానే చెప్పారని అన్నారు. అందుకు సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నల్లగొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.