– నిజాయితీ, నిబద్ధత గల సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి.జహంగీర్ను గెలిపించండి : పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్
నవతెలంగాణ-బీబీనగర్
అవకాశవాద, మతోన్మాద పార్టీలను ఓడించి నిజాయితీ నిబద్దత గల సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి.జహంగీర్ని గెలిపించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ పిలుపునిచ్చారు. యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ప్రజాస్వామ్యం, పౌర హక్కులు ఉండాలంటే కేంద్రంలో ఇండియా కూటమి గెలవాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి భయంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లో ముస్లిం, హిందువుల మధ్య విద్వేషం రగిల్చే విధంగా మాట్లాడారని విమర్శించారు. మోడీకి మన రాజ్యాంగం ఇష్టం లేదని, అందుకే మళ్లీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగం, ధరలు, ప్రభుత్వ రంగం, ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేదల సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం ఇండియా కూటమిని బలపరిచి గెలిపించాలని కోరారు. బీసీ జనగణన చేయని బీజేపీ.. భువనగిరి నియోజకవర్గంలో ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. బీజేపీని చిత్తుగా ఓడించి.. నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్, కొండమడుగు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లవుడియ రాజు, నాయకులు గాడి శ్రీనివాస్, కందాడి దేవేందర్ రెడ్డి, వెంకటేష్, బండారి శ్రీరాములు ఉన్నారు.