జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేడు దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని ఈసీ పేర్కొంది.

Spread the love