నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్హౌస్, సన్సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దాదాపు లక్ష మంది వరకు వాహనాల్లో వెళ్లినట్లు అంచనా. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.