ఐదుగురు వైమానిక
దళ సిబ్బంది మృతి
గువహతి : భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన ఏఎన్-32 విమానం అసోంలోని జోర్హాట్ జిల్లాలో ల్యాండ్ చేస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు వైమానికదళ సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని భారత వైమానిక దళం ప్రకటించింది. విధి నిర్వహణలో ఉన్న స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ వాయు ఖేమరామ్ కుమావత్, అగ్నివీర్ వాయు దానిశ్ ఆలం తమ ప్రాణాలను అర్పించారని ఐఏఎఫ్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొంది. ఈ ప్రమాదంలోని మృతులకు సంతాపం తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఐఏఎఫ్ పేర్కొంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఐఏఎఫ్ సీనియర్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం వైమానిక దళ కేంద్రాన్ని మూసివేశారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
అసోం జోర్హాట్లోకూలిన ఐఏఎఫ్ విమానం
- Advertisement -
- Advertisement -



