ఖమ్మం జిల్లా ఆస్పత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు

– రాష్ట్రంలో ఆ సర్టిఫికెట్‌ సాధించిన ఆరో దవాఖానా
– దేశంలోనే అత్యధిక అక్రిడిటేషన్లతో జాతీయ రికార్డు

 – తల్లిపాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఖమ్మం జిల్లాస్పత్రికి ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌’ గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానాలకు ‘బేబీ/బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఫ్రెండ్లీ హాస్పిటల్‌ ఇనిషియేటివ్‌’ (బీఎఫ్‌హెచ్‌ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్‌ అంద జేస్తారు. ఖమ్మంతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు దవాఖానాలు బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపును పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్‌ మొదటి బీఎఫ్‌హెచ్‌ఐ సర్టిఫికెట్‌ సాధించింది. ఆ తర్వాత జనగాం ఎంసీహెచ్‌, గజ్వేల్‌ ఏరియాస్పత్రి, సూర్యాపేట ఎంసీహెచ్‌, జహీరాబాద్‌ ఏరియాస్పత్రి ఈ గుర్తింపు పొందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేటెడ్‌ ప్రభుత్వ దవాఖానాలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. బిడ్డ పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు తాగించాలనీ, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా ఐదేండ్లలోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తల్లిపాల వినియోగం, శిశు మరణాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఒకవైపు ఎంసీహెచ్‌లు, ఎన్‌ఐసీయూలు వంటి సదుపాయాలు కల్పించింది. మరోవైపు ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా’ (బీపీఎన్‌ఐ) సహకారంతో 30 మంది మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణనిచ్చింది. ఇలా శిక్షణ ఇప్పిం చిన తొలిరాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఆయా ట్రైనీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశాలకు శిక్షణ ఇస్తున్నారు. వారు గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
ప్రత్యేక చర్యలివే
తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ అనేక చర్యలను తీసుకున్నది. ప్రసవమైన గంటలోపే ఆపరేషన్‌ థియేటర్‌లో లేదా ప్రసూతి గదిలో శిశువులకు ముర్రుపాలు అందిస్తే.. తల్లుల కేస్‌షీట్‌లో ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగులో ఉండే బ్రెస్ట్‌ ఫీడింగ్‌ స్టాంపులు వేస్తున్నారు. తద్వారా ఎంత మంది పిల్లలకు ముర్రుపాలు అందాయో పర్యవేక్షించేందుకు అవకాశం కలిగింది. రెండు కాంప్రహెన్సివ్‌ లాక్టేషన్‌ మేనేజ్మెంట్‌ సెంటర్లు (సీఎల్‌ఎంసీ), రెండు లాక్టేషన్‌ మేనేజ్మెంట్‌ యూనిట్లను (ఎల్‌ఎంయూ) స్థాపించారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానాల్లో అత్యధిక డెలివరీలు జరుగుతున్న 41 కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ ప్రత్యేకంగా లాక్టేషన్‌ వర్కర్లను నియమిం చింది. వీరు మూడు షిప్టుల్లో అందుబాటులో ఉంటారు. వీరు తల్లిపాల గురించి ఏఎన్సీ, పీఎన్సీ చెకప్‌ల సమయంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తారు. ఆపరేషన్‌ థియేటర్లలో, ప్రసూతి గదిలో ఉండి నవజాత శిశువులకు ముర్రుపాలు అందేలా చూస్తారు. మొదటి దశలో 50 ప్రభుత్వ దవాఖానాలకు బీఎఫ్‌హెచ్‌ఐ గుర్తింపు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు దవాఖానాలు అక్రిటిడేషన్‌ సాధించగా, మరో తొమ్మిది దవాఖానాలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి కూడా త్వరలోనే గుర్తింపు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికెట్‌ కాలపరిమితి మూడేండ్లు.
మంత్రి హరీశ్‌ రావు అభినందనలు
ఖమ్మం జిల్లాస్పత్రికి బీఎఫ్‌హెచ్‌ఐ అక్రిడేషన్‌ రావడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పడానికి ఇది మరో నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా నవజాత శిశుమరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.

Spread the love