ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం

– కార్మిక చట్టాలను కాపాడుకుందాం
– బీజేపీని ఓడిద్దాం
– సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌ మెట్‌
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుని, లౌకిక పార్టీలకు ఓటేద్దామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. పెద్ద అంబర్‌పేట మున్సిపల్‌, రావి నారాయణరెడ్డి కాలనీలో మేడే 138వ ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర్‌ హరిసింగ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ముత్యాల యాదయ్య రెడ్డి హాజరై మాట్లాడుతూ..కార్మికుల హక్కుల సాధన కోసం భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వమే ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, బాలగంగాధర్‌ తిలక్‌, జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలగు గొప్ప నాయకులతో ఏఐటీయూసీ సంఘం ముందుకు సాగిందని తెలిపారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతో మంది కార్మికులు తన రక్తం బొట్టును చిందిస్తూ ప్రాణ త్యాగాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన నిరంతరాయంగా ఉద్యమబాట పడుతూ కార్మికుల సమస్యలపై గొంతెత్తి ప్రజా ఉద్యమాలు ఏఐటీయూసీ చేపడుతోందన్నారు. పారిశ్రామిక రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ ప్రజా ఉద్యమాలు చేపట్టిందన్నారు. దేశంలో మతోన్మాదం పెచ్చు మీరుతుందని, బీజేపీ ప్రభుత్వం మతం ముసుగులో మరోసారి అధికారం లోకి రావడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందుకే కార్మికులు, కర్షకులు సంఘటిత, అసంఘటిత కార్మికులు, ప్రజలు ఒకే గొంతుకై బీజేపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా సంఘటి తమై లౌకిక పార్టీలకు ఓటేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగా రెడ్డి జిల్లా కార్యదర్శి అమనగంటి వెంకన్న, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాధ్యక్షుడు దాసరి ప్రసాద్‌, రాములు, ఆటో యూనియన్‌ నాయకులు ఈశ్వ రయ్య, నాయకులు నారాయణరెడ్డి, చిలుకూరి పుల్లయ్య, ధూపం నిరంజన్‌, బట్టల అనసూయ, భిక్షం నాయక్‌, వీరన్న, వినోద్‌ నాయక్‌, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love