కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
కళ్ళల్లో మరియు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం మండలంలోని రాఘవపట్నం గ్రామంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో రైతుల కల్లాల్లోని ధాన్యం పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పరిశీలించి మాట్లాడారు. సీజన్ దగ్గర పడుతున్న ఇంకా ధాన్యం కొనుగోలు మరియు తరలింపు జరగలేదని వెంటనే కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసినా తరలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన సమయానికి కొనేనాథుడు లేక అన్నదాతలు లబో,దిబోమంటున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కనీసం నష్ట పరిహారం ఇవ్వకుండా పంట ఇన్సూరెన్స్ డబ్బులు కూడా దోచుకుతింటూ, రైతన్నను చావు దెబ్బ తీస్తున్నారని అన్నారు. పంట పెట్టుబడికి అప్పులు చేసి పంట పండిస్తే, చివరికి ఆ పంటను అమ్ముకునే సమయంలో సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరుచుకువడానికి సరైన వసతులు కల్పించక, తరుగు పేరుతో రైతుని దగా చేస్తున్న మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్న రైతుకు ఆపన్న హస్తం అందించకుండా, ధాన్యం రవాణా చేయడానికి వాహనాలు కాంట్రాక్టు ఒకరికె ఇస్తూ, ధాన్యం సరఫరా చేయకుండా, ఇసుక రవాణా చేస్తూ, వాహనాల చుట్టూ రైతులు కాళ్ళరిగేల తిరిగిన కూడా కనికరించకుండా, రైతున్నల దగ్గర అదనపు డబ్బులు తీసుకుంటూ దగా చేస్తున్న కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకుండా, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని అన్నారు. ప్రజల కష్టాలను, నష్టాలను, అంచనా వేసి ప్రభుత్వంతో నష్ట పరిహారం ఇప్పించాల్సిన అధికారులు అధికార పార్టీ ఉత్సవాలకు, సమావేశాలకు జనాల్ని తరలిస్తూ బానిసలుగా బ్రతకడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటని అన్నారు. రైతు లేనిదే రాజ్యంలేదు, అలాంటి అన్నదాత ఈరోజు పుట్టెడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి ఉత్సవాల్లో పాల్గొనడం అత్యంత అమానవీయ చర్య అని అన్నారు. అందరి కడుపు నింపే రైతన్న ఈరోజు పండించిన పంటను అమ్మలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం అప్పులు తెచ్చిన రైతన్న ఆ అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటే పరమర్శించాల్సిన ప్రభుత్వాలు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఇది ప్రజా స్వామ్యమా లేక కీచక రాజ్యమా? అని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యపు బస్తాలను వాహనాలను సమకూర్చి తరలించాలని, తరలించిన ధాన్యం యొక్క డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, వచ్చే ఖరీఫ్ సీజన్ దగ్గరగా ఉండడం వల్ల పంట పెట్టుబడి కోసం వెంటనే పంట రుణాలు రైతన్నకు అందజేయాలని, పంట రుణమాఫీ కూడా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి, కోరం రామ్మోహన్, ఈక శేషు, వంశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love