న్యూఢిల్లీ : మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును అనుమతించే విషయంపై ఈ నెల 7వ తేదీన ఆదేశాలు జారీ చేస్తామని ఢిల్లీ కోర్టు తెలిపింది. ఛార్జిషీటుపై శనివారం నాడే అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఆదేశాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ విచారణ ఇంకా పురోగతిలో ఉన్నదని, అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేస్తామని నగర పోలీసులు తెలియజేయడంతో కేసును వాయిదా వేశారు. నేరానికి దారితీసిన కారణాలకు సంబంధించిన నివేదిక, సీడీఆర్ (కాల్ డిటైల్ రికార్డ్) నివేదిక కోర్టుకు అందాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఛార్జిషీటును అనుమతించే విషయంపై నిర్ణయాన్ని న్యాయమూర్తి ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు.