బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టేందుకు, దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అయితే స్వాతంత్య్ర సమరయోధులు అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది గాంధీ, నెహ్రూ మాత్రమే. కానీ.. మన భారత మహిళలు కూడా ఎందరో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. వారి గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. ఎన్నో ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే మహిళలు ధైర్యంగా అడుగు బయటకు పెట్టి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు నిండినా ఇప్పటికీ మహిళలకు సరైన గుర్తింపు లేదు. వివక్ష, అణిచివేత, హింసకు గురవుతూనే ఉన్నారు. అందుకే మహిళా సమానత్వం కోసం, హింస లేని సమాజం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు స్వాతంత్య్ర దినం సందర్భంగా ఆ మహిళల పోరాట పటిమను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వారు చూపిన పోరు బాటలో నడుద్దాం.
దుర్గాబాయి దేశ్ముఖ్
భారత స్వాతంత్య్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. చెన్నై, హైదరాబాదులలో ఆంధ్ర మహిళా సభలను స్థాపించి మహిళా చైతన్యానికి మారుపేరుగా నిలిచారు. మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. భారతదేశం రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలిగా కూడా ఈమె ఉన్నారు. సేవకు మారుపేరుగా దుర్గాభాయిని పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్మన్గా కూడా వ్యవహరించారు. దుర్గాభాయి దేశ్ ముఖ్ దేశం కోసం, మహిళల కోసం చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
‘భికాజీ రుస్తుం కామా’
భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్సీ మహిళ. ఈమె స్వాతంత్య్ర సమరయోధురాలు మాత్రమే కాదు, లింగ అసమానతలను నిర్మూలించడానికి తన జీవిత కాలమంతా పోరాడిన యోధురాలు. 1906లో జర్మనీలోని స్టుట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో భారత జెండాను ఎగురవేసిన ధీశాలి భాకాజీ కామా. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న సమయంలో ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది.1901 చికిత్స కోసం ఇంగ్లండ్కు వెళ్లారామె. అక్కడున్న భారత స్వాతంత్య్రోద్యమ కర్త శాంయజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై, 1905లో దాదాభారు నౌరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీని స్థాపించారు. అయితే బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని ఇండియాకు వెళ్ళనీయనంది బ్రీటీష్ ప్రభుత్వం. దీంతో భికాజీ ఇంగ్లండ్ వదలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకున్నారు. 1907 ఆగష్టులో జర్మనీలోని స్టుట్గార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు వెళ్ళి మనదేశ స్వాతంత్య్రం కోసం వారి మద్దతు కోరారు. మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి ఆ సమావేశంలో ప్రదర్శించారు. ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే. మొదటి ప్రపంచ యుద్ధంలో భికాజీ ఫ్రాన్స్లో నిర్బంధించబడ్డారు. యుద్ధానంతరం ఫ్రాన్స్లోనే వుండి, మన స్వాతంత్య్రం కోసం వ్యాసాలు రాస్తూ, ప్రసంగాలు చేస్తుండేవారు. 1935 తీవ్రమైన అస్వస్థతకు గురై భారతదేశం తిరిగివచ్చి 1936లో మరణించారు. తన యావదాస్తిని ఆవాబాయి పెటిట్ అనాథ శరణాలయానికి దానం చేసిన మహోన్నతురాలు ఈమె. ఇంతటి గొప్ప దేశ భక్తురాలి గుర్తుగా 1962లో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 1997లో మన కోస్ట్ గార్డ్ లోని అతివేగపు గస్తీ నౌకకు ఆమె పేరు పెట్టారు.
అనిబిసెంట్
బ్రిటిష్ సామ్యవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. గొప్ప వాక్పటిమ కలిగిన వ్యక్తి అనిబిసెంట్. ఈమె ఐరిష్ జాతికి చెందిన మహిళ. లండన్లోని క్లఫామ్లో 1847 అక్టోబరు 1న జన్మించారు. 1933 సెప్టెంబరు 20న తమిళనాడులోని అడయారులో మరణించారు. ఈమె మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి, మంచి వక్త. ఐర్లాండ్, భారతదేశాల స్వాతంత్య్రం, స్వయంపాలన కొరకు పోరాడి స్వయం పాలన ఉద్యమం స్థాపించిన మహోన్నత త్యాగశీలి. 1867 డిసెంబరులో తన 19వ ఏట, తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ని ఆమె పెండ్లి చేసుకున్నారు. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహంతో అనిబిసెంట్గా మారారు. ఈమె 1874లో ఇంగ్లాడులోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరారు. లా అండ్ రిపబ్లిక్ లీగ్ని స్థాపించి పోలీసుల అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేశారు. వారికోసం పోరాడారు. అలాగే ఆమె థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నాయకురాలు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1906లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ను ఆమె స్థాపించారు. ఆ సమయంలోనే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
సరోజినీ నాయుడు
భారత కోకిలగా పేరొందిన సరోజినీ నాయుడుకు ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధురాలు, కవయిత్రి. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహా సభలకు తొలి మహిళా అధ్యక్షురాలు. అలాగే స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ కూడా. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆమె పాత్రమరువలేనిది. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆమె ప్రముఖ పాత్ర పోషించారు.
ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి
ఈమె అసలు పేరు మణికర్ణిక. ఝాన్సీ రాజు బాజీరావు పీష్వాను వివాహం చేసుకున్నారు. అతని మరణం తర్వాత ఝాన్సీ రాజ్యానికి రాణి అయిన ఆమె పలు యుద్ధాల్లో ఆరితేరారు. దీంతో ఆమె ఝాన్సీరాణిగా పేరు పొందారు. ఈమె ధైర్యానికి మారు పేరు. కత్తి పట్టి కథనరంగంలోకి దూకిందంటే శతృవుల వెన్ను వణకాల్సిందే. 1857లో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామం అది. ఆ తర్వాత అనేక సార్లు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడి చరిత్రకెక్కారు.
సుచేతా కృపలానీ
స్వాతంత్య్ర సమరయోధురాలు, రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్కు మొదటి మహిళా ముఖ్యమంత్రి. సుచేతా కృపలానీ హర్యానాలోని అంబాలాలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేతా చురుకుగా పాల్గొనేవారు. క్విట్ ఉద్యమంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఆ తర్వాత మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు.
అరుణ అసఫ్ అలీ
అరుణ అసఫ్ అలీ భారత స్వాతంత్య్ర ఉద్యమ పోరాట యోధురాలు, సామాజిక కార్యకర్త కూడా. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్. ఈమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. అరుణ హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాళీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించారు. ఈమె విద్యాభ్యాసం లాహోరు, నైనీతాల్లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడి ఆ పరిచయం పెండ్లికి దారితీసింది. మతాల వేరు కావటంతో పెండ్లికి అరుణ తల్లిదండ్రులు ఒప్పకోలేదు. అంతేకాదు ఇద్దరికీ వయసులో 20 ఏండ్లకు పైనే తేడా ఉంది. వీటన్నించి పట్టించుకోని అరుణ 1928లో అసఫ్ అలీని వివాహమారాడు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో గర్వంగా జాతీయ జెండాను మోసినందుకు కాల్చి చంపేసి అస్సాంకు తొలి మహిళా అమరవీరురాలు కనక్లతా బారువా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్య్రోద్యమంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ‘ మహిళాదళాల్లో చేరి.. క్యాప్టెన్ హోదా పొందిన కాన్ఫూర్ వాసి లక్ష్మీసెహగల్. దేశం కోసం అన్నీ వదులుకుని 1921లో గాంధీ స్ఫూర్తితో విదేశీ దుస్తులను తగలబెట్టిన ధీశాలి జానకీదేవి బజాజ్. 16 ఏండ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధైర్యశాలి బీహార్కు చెందిన తార్కేశ్వరి సిన్హా, అక్షరాలనే ఆయుధాలుగా మలిచి కవితలతో స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాట పటిమను రాజేసిన అక్షరశిల్పి కుంతల కుమారి సబత్, క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని జైలుజీవితాలన్ని అనుభవించిన అన్నపూర్ణ మహారాణా ఇలా ఎంతోమంది వీరవనితలు దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు చరిత్రలోకి రాని ఎంతో మంది మహిళా మణులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఆడవాళ్లు గడపదాటి బైటకు రాకూడదనే ఆంక్షలున్నా ఆరోజుల్లో దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహామహోన్నత మూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు.
స్వాతంత్య్ర సమరభేరిలో సమయోచితంగా పోరాడిన మహిళామణులు ఎందరో ఎందరెందరో ఉన్నారు. కమలాదేవి ఛటర్జీ, అవిరాణి వాస్తవ, కమలానెహ్రూ. ‘గాంధీబురి’గా పేరు గాంచిన మాతంగిని హజ్రా. ఒరిస్సాకు చెందిన మధర్ థెరిస్సాగా పేరొందిన ప్రభిత గిరి, 1857 నాటి గొప్ప తిరుగుబాటుదారులలో ముఖ్య పాత్ర వహించిన ముస్లిం మహిళ బేగం హజ్రత్ మహల్ ఇలా ఎందరో ఉన్నారు.