సఫాయన్నా నీకు సలామన్నా: సీఎం కేసీఆర్

– సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు
నవతెలంగాణ – హైదరాబాద్
గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంధర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ‘‘మనుషులు పరిసరాలు పరిశుభ్రంగా వుంచుతూ తోటి మానవుల కోసం వారి జీవితాలను త్యాగం చేస్తున్న పారిశుద్య కార్మికులు భగవంతుని అంతటి వారు. వారు చేస్తున్న పనికి మనం ఏమాత్రం వెలకట్టలేం. వారికి ప్రభుత్వం సాయం చేయడమంటే పరోక్షంగా సమాజానికి సాయం చేయడం వంటిదే. సఫాయి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నది. వారు ఎటువంటి డిమాండు చేయకున్నా జీతాలు పెంచుతున్న కారణం వారిమీద గౌరవంతోనే..’’ నని సిఎం స్పష్టం చేశారు. పారిశుద్యకార్మికులు లేని సమాజాన్ని ఊహించుకోవడం కూడా కష్టమేనని సీఎం అన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు చెప్పి సభలో ఆలోచనతో పాటు సీఎం నవ్వులు పూయించారు. ఉదాహరణకు మనకు క్షవరం చేసే వారు లేరనుకుందాం. అప్పుడు మనుషులు ఎట్లా వుంటారో వూహించుకోండి. నెత్తిపెరిగి గడ్డం పెరిగి గుడ్డేలుగులు లెక్క తిరుగుతుంటారు. అనగానే సభలో నవ్వులు విరియడంతో పాటు ఈ దేశంలో సేవలు చేసే మనుషుల త్యాగాలు ఎంత గొప్పవో సీఎం ఎరుకపరిచారు. వారిని గౌరవించుకోవడం మనందరి కర్తవ్యమని ఉద్భోదించారు. సేవలు చేసే మనుషులు వుండబట్టే మానవ సమాజం సుఖ సంతోషాలతో జీవిస్తున్నదన్నారు. రోడ్లు పరిసరాలను పరిశుభ్రం చేయకుండా వుంటే ఎంత అధ్వాన్నంగా పరిస్థితులు తయారౌతాయో ఆలోచించడానికి కూడా కష్టమేనన్నారు. ఈదేశ అభివృద్ధిలో రాష్రా రభివృద్ధిలో సఫాయన్నలు అక్కల పాత్ర చాలా గొప్పదని సిఎం అన్నారు. దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ఉత్తమ సఫాయీ కార్మికులను గుర్తించి…మహిళా పురుష కార్మికులకు అవార్డులు అందచేస్తామని సిఎం తెలిపారు.

Spread the love