– కాంగ్రెస్ నేతలు రైతులకు క్షమాపణలు చెప్పాలి
– వారికి కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
– గంట కరెంట్తో కాంగ్రెస్ నేతలు పావు ఎకరమైనా పండిస్తారా….? : తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉచిత కరెంట్పై కాంగ్రెస్ వైఖరిని ప్రజలు నిలదీస్తారనే భయంతో ఈ నెల 20న కాంగ్రెస్ తలపెట్టిన ప్రజాభేరి సభను వాయిదా వేసుకుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. రైతులను చిన్నచూపు చూసిన ఉచిత, కరెంట్పై అవాకులు చవాకులు పెలినా కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులు అనే వారు లేకుండా చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. రైతులు సంతోషంగా ఆర్ధికంగా ఎదగాలని 24 గంటలు కరెంట్ ఇస్తే వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రైతుల పట్ల గతంలో చంద్రబాబు వైఖరినే నేడు తెలంగాణ కాంగ్రెస్ అమలు చేయాలని చూస్తుందన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నిండిపోయిందని చెప్పారు. ఉచిత కరెంట్ ఇస్తే కండ్లు మండుతున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఉచిత కరెంట్ హామీలు ఉత్తవేనని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో పుష్కలంగా నీరు, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి రైతును రాజునే చేస్తుంటే.. కాంగ్రెస్ ఉచిత కరెంట్ వద్దు, 3 గంటలు చాలంటూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. 3 గంటలు చాలంటున్న కాంగ్రెస్ నేతలు గంట కరెంట్తో పావు ఎకరమైనా పారిస్తారా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ నేతలు ఏసీ గదులను వదిలి రైతుల పొలాల దగ్గరికి వెళితే 24 గంటల కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందని సూచించారు.