బ్రిజ్‌భూషణ్‌ ఇంటి వద్ద సీన్‌ రీక్రియేషన్‌..

న్యూఢిల్లీ నవతెలంగాణ: బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన ఇంటికి ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ రీక్రియేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు పీటీఐ కథనం వెల్లడించింది. ‘‘శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో దిల్లీలోని బ్రిజ్‌ భూషణ్‌ అధికారిక నివాసానికి పోలీసులు మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లారు. ఆమె వెంట మహిళా కానిస్టేబుల్స్‌ కూడా ఉన్నారు. దాదాపు అరగంట పాటు పోలీసులు అక్కడ ఉన్నారు. ఆ నివాసంలో ఎక్కడెక్కడ వేధింపులకు గురైందో గుర్తుకు తెచ్చుకుని ఆ సీన్‌ను రీక్రియేట్‌ చేయాలని పోలీసులు ఆమెను అడిగారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్‌ భూషణ్‌పై దిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతోంది. ఇప్పటివరకు 180కి పైగా మందిని విచారించారు. దర్యాప్తు పూర్తి చేసి వచ్చే వారం లోగా కోర్టుకు నివేదిక సమర్పిస్తామని ఇటీవల సిట్‌ అధికారులు వెల్లడించారు. బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇటీవల భారత అగ్రశ్రేణి రెజర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొన్ని రోజుల పాటు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. వీరి ఆందోళన ఇటీవల ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

Spread the love