అమెరికాలో కాల్పుల కలకలం..

– నలుగురు మృతి
న్యూయార్క్‌: అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో వణికిపోయింది. జార్జియాలోని హెన్రీ కౌంటిలో ఉన్న హాంప్టన్‌ ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరణించినవారిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని హాంప్టన్‌ పోలీస్‌ చీఫ్‌ జేమ్స్‌ టర్నర్‌ వెల్లడించారు.
హాంప్టన్‌ చెందిన 40 ఏండ్ల వయస్సున్న ఆండ్రీ లాంగ్‌మోర్‌ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. అతడి గురించి సమాచారం అందించినవారికి 10 వేల డాలర్లు రివార్డు ప్రకటించారు. నలుపు రంగులో ఉన్న జీఎంసీ అకాడియా ఎస్‌యూవీలో అతడు తప్పించుకుని ఉండొచ్చని చెప్పారు. అతని ఫొటోను అధికారులు విడుదల చేశారు. కాగా, అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 31 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో 153 మంది ప్రాణాలు కోల్పోయారు.

Spread the love