నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి తానే సుప్రీం అని వ్యాఖ్యానించారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేనని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవసరం లేదని అనిపిస్తుందని అన్నారు. తన నియోజకవర్గంలో కష్టమైన పరిస్థితులు ఉన్నాయని.. ఫ్లెక్సీలు కట్టాలన్నా, డప్పు కొట్టాలన్నా, కొలాటమాడాలన్నా భయపడుతున్నారని చెప్పారు. కొంతమంది ఎందుకు అభద్రత భావంతో ఉన్నారో అర్దం కావడం లేదని రాజయ్య తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని కేశవనగర్లో గ్రామ పంచాయతీ భవనాన్ని రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పార్టీ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ సమక్షంలో కడియం శ్రీహరితో రాజయ్య కలిసిపోయారు. అయినా రాజయ్యలో అసంతృప్తి చల్లారలేదని ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.