హైదరాబాద్ లో దారుణం..యువతి దారుణ హత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : గతంలో పెండ్లి చేసుకోవాలని ఆమెను వేధించాడు. మైనర్ అయిన యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో కక్ష కట్టిన యువకుడు ఆమెను అతి దారుణంగా బండ రాయితో మోది హత్య చేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో అర్ధ రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ యువతి తలపై బండరాయితో మోది హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీం, జాగిలాలను రప్పించి పరిశీలించారు. ఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ పరిశీలించారు. స్థానికులతో పాటు యువతీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతురాలిని హసన్ నగర్ ప్రాంతానికి చెందిన సమీరా ఖాన్ గా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన మోహిన్ హైమద్ ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పెండ్లి చేసుకుంటానని అతడు యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పగా నిరాకరించారు. దీంతో కక్షగట్టిన హైమద్ యువతిని తీసుకొచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Spread the love