నవతెలంగాణ-హైదరాబాద్ : ఊయలే ఉరితాడుగా మారి చిన్నారి ప్రాణం తీసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మల్దకల్కు చెందిన హేమలత, పరశురాముడు జ్యూస్ సెంటర్, టీ కొట్టు నడుపుతున్నారు. కాగా, వారి కూతురు బోయ ఇందు ఎనిమిదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో చీరతో ఏర్పాటు చేసిన ఊయలలో ఊగుతుండగా.. చీర మెడకు చుట్టుకొని ఊపిరాడక కొట్టుమిట్టాడుతుండగా.. గమనించిన ఇందు చెల్లెలు తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు చిన్నారిని వైద్యం కోసం గద్వాల ఏరియా దవాఖానకు తరలించారు. కాగా, అప్పటికే ఇందు మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. బాలిక తల్లి హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.