గమ్యం చేరని ప్రేమలేఖలు

పేరుకు రెండే అక్షరాలు
కానీ, మహా చిలిపివి ఆ అక్షరాలు
గుండెల్లో దాగి
ఊసులాడతాయి
కవ్విస్తాయి… కన్నీళ్లు పెట్టిస్తాయి
ఆనందాన్ని ఇస్తాయి… త్యాగాలకు సంసిద్ధం చేస్తాయి.
దానికి, కాలంతో కానీ…కులంతో కానీ..
ప్రపంచంతో కానీ పనిలేదు
ప్రేమ అన్న పలుకే
స్వచ్ఛమైనది… నిర్మలమైనది…
అలాంటి ప్రేమ ఇప్పుడు
పట్టాలపై రక్తపు మడుగులో
గమ్యం చేరిందా లేదా అన్నది వేల డాలర్ల ప్రశ్న.

కోరమాండల్‌ బోగీలో ప్రయాణించిన బెంగాలి తన ప్రేయసిని గుర్తుకు చేసుకుంటూ రాసుకున్న డైరీకి సంబంధించి పేజీలు రైలు పట్టాలపై రక్తపు మడుగులో కనిపించాయి. దీంతో అవి చూసిన వారి కండ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. డైరీల్లోని పేజీల్లో ప్రేమ కావ్యాలు.. అందంగా గీసిన చిత్రాలు, పుష్పాలు, సూర్యూడు ఇలా చాలా బొమ్మలు కనిపించాయి. అందులో ‘చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులను కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ సుకుమాలు విరబూస్తాయి’ అని బెంగాలీలో రాసి ఉంది. ‘అన్ని వేళలా నీ ప్రేమ నాకు కావాలి.. నువ్వు నా మదిలో ఎప్పుడూ ఉంటావు’. అని రాసిఉన్న కాగితాలు ఇద్దరు ప్రేమికులను గుర్తుకు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నాయి అన్నట్లుగా ఉన్నాయి. అయితే ఈ డైరీ ఎవరిది..? ఆ వ్యక్తి మరణించాడా..? బతికే ఉన్నాడా..? అని తెలియలేదు.

Spread the love