జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఏపీ గవర్నర్‌గా తోఫా

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ కి మూడో గవర్నర్‌గా నియమితులైన సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన జనవరి 4న పదవీ విరమణ చేశారు. 1958 జనవరి 5న కర్నాటకలోని బెలువాయిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ఫకీర్‌ సాహెబ్‌. ముడబిద్రి ప్రాంతంలోని మహవీర కళాశాలలో బికాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన మంగళూరులోని కొడియాల్‌బైల్‌లోని ఎస్‌డీఎం కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు.
1983లో న్యాయవాదిగా నమోదు చేసుకుని కర్నాటక హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2003 మే నెలలో కర్నాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న నజీర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే దేశ అత్యున్నత న్యాయస్థానానికి పదోన్నతి పొందిన మూడో న్యాయమూర్తి నజీర్‌ కావడం విశేషం.
కీలక తీర్పులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్‌ పలు కీలక తీర్పులను ఇచ్చారు. త్రిపుల్‌ తలాక్‌, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. 2017లో వివాదాస్పద త్రిపుల్‌ తలాక్‌ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి. ముస్లిం షరియా చట్టం ప్రకారం ట్రిపుల్‌ తలాక్‌ అనుమతించబడుతుందని నజీర్‌తోపాటు మరొ న్యాయమూర్తి సమర్థించారు. అయితే బెంచ్‌లో 3:2 మెజారిటీతో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించడంతో ఈ కేసు వీగిపోయింది.
అయోధ్య రామమందిరంపై తీర్పు
2019లో అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్‌ నజీర్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. ధర్మాసనంలోని అయిదుగురు జడ్జీలు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగానే తీర్పునిచ్చారు. అయితే పదవీ విరమణకు కొన్ని నెలల ముందు జస్టిస్‌ నజీర్‌ రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2016లో రూ.500,1000 నోట్ల రద్దుకు సంబంధించిన కేసులను విచారించింది. జనవరి 4న రిటైర్‌అయిన వెంటనే నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ పదవికి సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన
న్యాయమూర్తుల కు పదవులు
అయోధ్య కేసులోని ఏకగ్రీవ తీర్పులో న్యాయమూర్తులకు కేంద్ర ప్రభుత్వం పదవులను కట్టబెట్టింది. అయోధ్య ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులలో డివై చంద్రచూడ్‌ ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మరికొందరు పదవీ విరమణ చేశారు. మాజీ సిజెఐ ఎస్‌ఎ బాబ్డే మినహాయించి ఆ ధర్మాసనంలో మిగతా న్యాయ మూర్తులందరికీ పదవులు వచ్చాయి. మాజీ సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోరు రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రపతి చేత నియామకం అయ్యారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఎన్సిఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌ గా నియమితులయ్యారు. ఇప్పుడు అబ్దుల్‌ నజీర్‌ గవర్నర్‌గా నియమితులు కావటం విశేషం.

Spread the love