లాటరీ ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు ఖరారు

– జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
నవతెలంగాణ ‌- పెద్దపల్లి టౌన్
లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా జిల్లాలో మద్యం షాపులు కేటాయింపు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.సోమవారం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన మద్యం (ఏ4) షాపుల కేటాయింపు ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొని పారదర్శకంగా లాటరీ పద్దతి న మద్యం షాపులు కేటాయించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 77 ఏ4 మద్యం షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు రిజర్వ్ చేసి సదరు షాపులను లాటరీ ద్వారా కేటాయించామని అన్నారు. జిల్లాలో ఉన్న 77 ఏ4 మద్యం షాపులకు 2022 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు చేశామని అన్నారు. మద్యం షాపుల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని తెలిపారు.మద్యం షాపులను దక్కించుకున్నవారు ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్ టాక్స్ వార్షిక పన్నులో 6వ వంతు వెంటనే చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి,దరఖాస్తు దారులు, ఎక్సైజ్, ఫైర్, వైద్య శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

Spread the love